హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ నుంచి ఏపీకి ఐదు టీఎంసీల నీటిని విడుదల చేయాలని కేఆర్ఎంబీ సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు సమాచారం. శ్రీశైలం, నాగార్జునసాగర్ ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల అంశంపై గత అక్టోబర్లో నిర్వహించిన త్రిసభ్య కమిటీ సమావేశం అప్పటికి అందుబాటులో ఉన్న జలాల్లో 35 టీఎంసీలను తెలంగాణకు, 45 టీఎంసీలను ఏపీకి కేటాయించింది. ఆ తరువాత ఎలాంటి ఇండెంట్ పెట్టకుండానే నవంబర్ 29న అర్ధరాత్రి 100 మంది పోలీసులతో ఏపీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా నాగార్జునసాగర్ డ్యామ్ను ఆక్రమించింది. కుడికాలువ గేట్లను తెరిచి నీటిని తరలించుకుపోవడం ప్రారంభించింది. తెలంగాణ అభ్యంతరాలు తెలపడం, కేంద్రం జోక్యంతో ఏపీ అప్పుడుగానీ డ్యామ్ నుంచి 5 టీఎంసీల జలాలను విడుదల చేయాలని కేఆర్ఎంబీకి ఇండెంట్ను పెట్టలేదు. ఏపీ ఇండెంట్ ప్రతిపాదనలపై అభిప్రాయం తెలపాలని బోర్డు తెలంగాణకు లేఖకు రాసింది. ఈ నేపథ్యంలో వేసవి తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని నీటి విడుదలపై బోర్డే నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ వెల్లడించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఏపీకి 5 టీఎంసీలను విడుదల చేయాలని కేఆర్ఎంబీ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్టు సమాచారం. నేడో, రేపో ఈ మేరకు రిలీజ్ ఆర్డర్ వచ్చే అవకాశం ఉన్నది.