హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ) : శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో నీటి వినియోగానికి సంబంధించి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) త్రిమెన్ కమిటీ రేపు (గురువారం) ప్రత్యేకంగా సమావేశం కానున్నది. ఈ మేరకు బోర్డు ఇరు రాష్ర్టాలకు సమాచారం ఇచ్చింది. కమిటీలో బోర్డు మెంబర్ సెక్రటరీ, ఇరు రాష్ర్టాలు ఈఏన్సీలు సభ్యులుగా ఉంటారు.
త్రిసభ్య కమిటీ గత అక్టోబర్లోనే సమావేశమై రెండు రిజర్వాయర్లలో దాదాపు 82కి పైగా టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని నిర్ధారించింది. అందులో ఏపీకి 45, తెలంగాణకు 35 టీఎంసీలను కేటాయించింది. మిగిలిన 2 టీఎంసీలను మే నెల తర్వాత భవిష్యత్ అవసరాలకు వినియోగించాలని తెలిపింది. అయితే, తెలంగాణ ఇప్పటికే కోటాకు మించి నీటిని వాడుకున్నది.
కాగా, ఏపీ తన కోటాలో 42 టీఎంసీలను వినియోగించుకోగా, మరో 3 టీఎంసీలు మిగిలి ఉన్నాయి. తాజాగా ఏప్రిల్లో మరో 5 టీఎంసీలను విడుదల చేయాలని ఇటీవల ఆంధ్రప్రదేశ్ కేఆర్ఎంబీకి లేఖ రాసింది. కోటాకు మించి 2టీఎంసీలను కోరుతున్నది. ఈ నేపథ్యంలో త్రిమెన్ కమిటీ ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు తెలుస్తున్నది.