హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): కృష్ణా నదీ జలాల వినియోగానికి సంబంధించి తెలంగాణ, ఏపీ మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించేందుకు ఏర్పాటైన కేఆర్ఎంబీ (కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఒంటెత్తు పోకడలతో విభజన చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. ఏపీ కనుసన్నల్లో నడుచుకుంటూ తెలంగాణ అభ్యంతరాలను, విజ్ఞప్తులను పక్కనపెడుతున్నదని ఇంజినీర్లు మండిపడుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలోని పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా 34 టీఎంసీలను మాత్రమే వినియోగించుకోవాల్సిన ఏపీ.. ఏటా ఆ కోటాకు మించి భారీగా జలాలను తరలించుకుపోతున్నది. ఇలా నిరుడు కూడా కోటాకు మించి దాదాపు 53 టీఎంసీలను మళ్లించింది. ఆ జలాలను కృష్ణా బేసిన్ అవతల పెన్నా బేసిన్లో నిర్మించిన రిజర్వాయర్లలో నిల్వ చేసుకుంటున్నది. ఆయా రిజర్వాయర్ల మొత్తం సామర్థ్యం 350 టీఎంసీలు. అయినా ఏపీ అక్కడితో ఆగడంలేదు. మరుసటి నీటి సంవత్సరం ప్రారంభం కాగానే మళ్లీ కొత్త లెక్కలంటూ వాదనలకు దిగడమేగాకుండా, అప్పటికే కోటాకు మించి తరలించుకుపోయిన జలాలను పరిగణనలోకి తీసుకోవద్దనడం ఏపీకి పరిపాటిగా మారింది. దీనిపై తెలంగాణ మొదటి నుంచే తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నది. పోతిరెడ్డిపాడును కేవలం 34 టీఎంసీలకే పరిమితం చేయడంతోపాటు అక్కడి మళ్లించి నిల్వచేసిన జలాలను కూడా లెక్కలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నది. దీనిపై కేఆర్ఎంబీ స్పందించడం లేదు.
వాస్తవానికి శ్రీశైలం ప్రాజెక్టును హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టుగానే ట్రిబ్యునల్ గుర్తించింది. దీంతో అక్కడ జలవిద్యుత్తును ఉత్పత్తి చేసి నీటిని దిగువన ఉన్న నాగార్జునసాగర్కు, అక్కడి నుంచి ఆ ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టుకు అందజేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఫలానా సమయంలో, ఫలానా మొత్తంలో నీటిని విడుదల చేయాలన్న నిబంధనలు ఎక్కడా లేవు. అయినా ఏపీ పదే పదే అభ్యంతరం తెలపడం, ఆ వెంటనే విద్యుత్తు ఉత్పత్తిని నిలిపివేయాలని కేఆర్ఎంబీ లేఖలు రాయడం పరిపాటిగా మారింది. ఇటీవల శ్రీశైలంలో తెలంగాణతోపాటు ఏపీ కూడా విద్యుత్తు ఉత్పత్తిని ప్రారంభించింది. దీనిపై కేఆర్ఎంబీ అభ్యంతరం తెలుపుతూ తెలంగాణకు లేఖ రాసిన కేఆర్ఎంబీ.. ఏపీకి మాత్రం ఎలాంటి లేఖ రాయకపోవడం గమనార్హం. తెలంగాణ విద్యుత్తు ఉత్పత్తిని ప్రారంభించగానే ఆక్షేపించిన కేఆర్ఎంబీ.. మరోవైపు ఏపీ ఎలాంటి ఇండెంట్ సమర్పించకుండానే పోతిరెడ్డిపాడు నుంచి నీటిని మళ్లిస్తున్నా కిక్కురుమనడం లేదు. దీంతో కేఆర్ఎంబీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నదని, ఏపీకి ప్రయోజనం చేకూర్చడమే పరమావధిగా పెట్టుకున్నదని ఇంజినీర్లు ధ్వజమెత్తుతున్నారు.
తెలంగాణ ఏది కోరినా బేఖాతర్
కృష్ణా జలాలను ఏడాదిపాటు 66ః34 నిష్పత్తితో వినియోగించుకునేందుకు గతంలో చేసుకున్న తాత్కాలిక ఒప్పందాన్ని ఇకపై ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోమని ఈ ఏడాది మే 10న జరిగిన కేఆర్ఎంబీ 17వ సమావేశంలో తెలంగాణ తేల్చిచెప్పింది. ట్రిబ్యునల్ అవార్డు వచ్చేవరకు 50ః50 నిష్పత్తిలో వినియోగించుకుంటామని ఆ సమావేశంలో కరాఖండిగా స్పష్టం చేసింది. దీంతో ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చిన కేఆర్ఎంబీ.. ఇప్పటికీ ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. తెలంగాణ డిమాండ్ను కేంద్రానికి విన్నవించలేదు. బోర్డు సమావేశ నిర్ణయంపై తీసుకున్న చర్యలకు సంబంధించిన సమాచారాన్ని కూడా తెలంగాణకు ఇవ్వకపోవడం గమనార్హం.
భారీ మొత్తంలో నీటిని నిల్వను చేసుకునేందుకు తెలంగాణలో ఆఫ్లైన్ రిజర్వాయర్లు లేవని, ఈ నేపథ్యంలో ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్లో నీటిని నిల్వ చేసుకుని తదుపరి సంవత్సరంలో తాగు, సాగు అవసరాలకు వినియోగించుకునేందుకు అవకాశమివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నది. అలా కామన్ రిజర్వాయర్లలో నిల్వ చేసుకున్న నీటిని తదుపరి సంవత్సరానికి సంబంధించిన కోటాలో చేర్చవద్దని కోరుతున్నది. అయినప్పటికీ ఏపీ మోకాలడ్డం, దానికి కేఆర్ఎంబీ వంతపాడడం పరిపాటిగా మారింది. నీటి సంవత్సరం మొదలు కాగానే కామన్ రిజర్వాయర్లలో ఉన్న నీటి నిల్వలన్నింటినీ తదుపరి సంవత్సరానికి సంబంధించిన ఓపెనింగ్ బ్యాలెన్స్గా చూపుతున్నది. కానీ, పెన్నా బేసిన్లో ఏపీ నిల్వ చేసుకున్న కృష్ణా జలాలను మాత్రం లెక్కించడం లేదు.
శ్రీశైలం నుంచి విడుదల చేసిన నీటికి, నాగార్జునసాగర్ వద్దకు చేరిన నీటికి ప్రతిసారీ ఎంతో వ్యత్యాసం కనబడుతున్నది. దీనిపై తెలంగాణ అనేక అనుమానాలు, అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో బాథోమెటిక్ సర్వే చేయించాలని గతంలోనే నిర్ణయించారు. అదేవిధంగా పోతిరెడ్డిపాడు నుంచి విడుదల చేసిన నీటికి, చెన్నైకి చేరుకుంటున్న నీటికి కూడా బాథోమెటిక్ సర్వే చేయాలని నిర్ణయించారు. కానీ, ఈ రెండు అంశాలను కేఆర్ఎంబీ అటకెక్కించింది. దీనిపై తెలంగాణ ఎన్ని విజ్ఞప్తులు చేసినా బోర్డు స్పందించడం లేదు.
బోర్డు సమావేశాల నిర్వహణ తేదీల ఖరారు, ఆయా సమావేశాలకు సంబంధించిన ఎజెండా రూపకల్పనలోనూ కేఆర్ఎంబీ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నది. ఈ విషయంలో ఇరు రాష్ర్టాలను సంప్రదించాల్సిన కేఆర్ఎంబీ.. అలాంటి సంప్రదింపులేమీ జరపకుండానే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం పరిపాటిగా మారిపోయింది. దీంతో అనేక సార్లు బోర్డు సమావేశాలు వాయిదా పడిన సందర్భాలున్నాయి. వాస్తవానికి తెలంగాణ ఏ విజ్ఞప్తి చేసినా పట్టించుకోని బోర్డు.. ఏపీ అడిగిన వెంటనే సమావేశ తేదీలను ఖరారు చేస్తున్నది. ఇలా ప్రతి అంశంలోనూ బోర్డు పూర్తిగా ఏపీకి వంతపాడుతున్నదని, తెలంగాణ సమస్యలపై ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నదని ఇంజినీర్లు విమర్శిస్తున్నారు. ఇకనైనా పక్షపాత వైఖరిని వీడి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కేఆర్ఎంబీని కోరుతున్నారు.