హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగినంతగా లేవని, వచ్చే ఏడాది వరకు తాగునీటి అవసరాలు ఉన్న నేపథ్యంలో నీటిని పొదుపుగా వాడుకోవాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సూచించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న జలాల్లో 35 టీఎంసీలను తెలంగాణకు, 45 టీఎంసీలను ఏపీకి కేటాయించారు. ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు సంబంధించిన అంశంపై త్రిసభ్య కమిటీ సమావేశం మెంబర్ సెక్రటరీ రాయపురే అధ్యక్షతన శుక్రవారం కొనసాగింది. ఈ సందర్భంగా తెలంగాణ ఈఎన్సీ మురళీధర్, ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి ఈ ఏడాది ఇరు రాష్ర్టాలకు నీటి అవసరాలకు సంబంధించిన ఇండెంట్లను బోర్డుకు నివేదించారు. అనంతరం మెంబర్ సెక్రటరీ మాట్లాడుతూ.. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల్లో ఉమ్మడి రిజర్వాయర్లకు నిర్దేశిత మొత్తంలో జలాలు రాలేదని, ప్రస్తుతం నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్లలో కేవలం 82.78 టీఎంసీలు మాత్రమే వినియోగానికి అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. వచ్చే ఏడాది జూన్-జూలై వరకు తాగు నీటి అవసరాలు తీర్చాల్సి ఉన్నదని తెలిపారు.