మూసాపేట(అడ్డాకుల), ఫిబ్రవరి 22 : సీఎం కేసీఆర్ పట్టుదల, వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి సహకారం, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి చొరవతో కృష్ణా జలాలను ఎత్తిపోసి అడ్డాకుల బీడు భూముల్లో పారించడంతో ఆ గ్రామ ప్రజల 70 ఏండ్ల జల కల నెరవేరింది. బుధవారం మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల పెద్దచెరువుకు కృష్ణా జలాలు రావడంతో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, రైతులతో కలిసి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి కృష్ణా జలాలకు పూజలు చేశారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ను లిఫ్ట్ల సాయంతో దాదాపు 780 ఫీట్ల ఎత్తున ఉన్న గుడిపల్లికి ఎత్తిపోసి.. అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా ఎత్తైన ప్రదేశంలో ఉన్న అడ్డాకులకు సాగునీటిని తీసుకురావడం గొప్ప విషయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.