Krishna Water Dispute | తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా నదీ జలాల వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. కృష్ణా జలాల వివాదంలో వివరణ దాఖలు చేసేందుకు గడువు కావాలని ఏపీ ప్రభుత్వం ట్రైబ్యునల్ కోరింది. అయితే, ఇందుకు ట్రైబ్యునల్ నిరాకరించింది. జూన్ వరకు సమయం ఇవ్వాలని ఏపీ చేసిన విజ్ఞప్తిని ట్రైబ్యునల్ తోసిపుచ్చింది. అయితే, కృష్ణా నదీ జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పూర్తి వివరణ దాఖలు చేసేందుకు మరికొంత సమయం పడుతుందని, ఈ మేరకు గడువు కోరుతూ దరఖాస్తు చేసింది.
ఏపీలో ఎన్నికల నేపథ్యంలో గడువును జూన్ వరకు పొడిగించాలని కోరింది. ఏపీ దరఖాస్తుపై ట్రైబ్యునల్ విచారణ జరిపింది. ఏపీ గడువు కోరడంపై తెలంగాణ ప్రబుత్వం అభ్యంతరం తెలిపింది. పెండింగ్ వ్యవహారాలకు ఎన్నికల కోడ్ అడ్డంకి కాదని చెప్పింది. కాలయాపన కోసమే గడువు కోరుతుందని ఆరోపించింది. ఈ మేరకు ఇరు రాష్ట్రాల వాదనలు విన్న ట్రైబ్యునల్ జూన్ వరకు గడువు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఏప్రిల్ 29లోగా వివరణ ఇవ్వాలని ఏపీ సర్కారును ఆదేశించింది. స్టేట్మెంట్ వచ్చాక రెండువారాల్లో కౌంటర్ దాఖలు చేసుకోవచ్చని రెండు రాష్ట్రాలకు చెప్పింది. విచారణను మే 15వ తేదీకి వాయిదా వేసింది.