హైదరాబాద్, ఫిబ్రవరి29 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ నుంచి ఏపీకి 3 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) ఉత్తర్వులు జారీచేసింది. మార్చి నెలకు సంబంధించి సాగర్ కుడి కాలువ ద్వారా 3 టీఎంసీలు, ఏప్రిల్ నెలకు సంబంధించి 5 టీఎంసీలను విడుదల చేయాలని ఏపీ ఇప్పటికే బోర్డుకు లేఖ రాసింది. తాజాగా అందుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ సారి నీటి విడుదలకు ఇద్దరు బోర్డు అధికారులను కూడా ప్రత్యేకంగా నియమించింది. వారు శుక్రవారం సాగర్ వద్దకు వెళ్లి ఇరు రాష్ర్టాల అధికారుల సమక్షంలో కుడి కాలువ హెడ్రెగ్యులేటరీ ద్వారా ఏపీకి 3 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నారు. నీటి విడుదల గేజ్లను నమోదు చేయనున్నారు. నిర్ణీత మొత్తంలో నీరు ఏపీకి చేరిన వెంటనే తిరిగి అధికారుల సమక్షంలోనే కుడికాలువ హెడ్రెగ్యులేటరీని బంద్ చేయనున్నారు.