హైదరాబాద్, జూలై22 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ తెలంగాణలో ప్రజారంజక పాలన అందిస్తున్నారని, ప్రపంచంలోనే ఆదర్శ ప్రజాప్రతినిధిగా ఆయన నిలుస్తారని బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు కొనియాడారు. పదేండ్ల కాలంలోనే వందేండ్ల ప్రగతికి బాటలు వేసిన సీఎంగా కేసీఆర్ కొత్త చరిత్రకు నాంది పలికారని చెప్పారు.
అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం ర్యాలీ పట్టణంలో ట్రైయాంగిల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. అనంతరం ట్రైయాంగిల్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజుసిరి అధ్యక్షతన పలువురు ఎన్నారైలు వకుళాభరణం కృష్ణమోహన్రావును సత్కరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు నారాయణ, అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.