Congress | హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ప్రజాపాలన పేరుతో.. పోలీసు పాలన కొనసాగుతున్నదా? కాంగ్రెస్ పాలనలో సోషల్ మీడియాలోనూ ప్రశ్నించే గొంతులను పిసికేస్తున్నారా? ఎటుచూసినా అక్రమ కేసులు, భౌతిక దాడులతో గూండాగిరి రాజ్యమేలుతున్నదా? అంటే అవుననే అంటున్నారు తెలంగాణవాదులు. బీఆర్ఎస్ హయాంలో పదేండ్లు కక్షలు, కేసులు, పగలు, కుట్రలు లేకుండా పాలన సాగితే.. కేవలం నాలుగు నెలల్లోనే ప్రజాపాలనలో అక్రమ కేసులు, భౌతిక దాడులు, హత్యాయత్నాలు, నిర్బంధపు అరెస్టులు నిత్యకృత్యంగా మారాయి. నేటి కాంగ్రెస్ పాలనలో ఒక ప్రశ్నకు ఎదురుదాడే జవాబుగా మారింది. ఒకమాటకు భౌతికదాడి సమాధానవుతున్నది. ఒక పోస్టుకు పోలీసు నోటీసులే నిదర్శనంగా మారాయి. ఆఖరికి సోషల్ మీడియాలో కూడా స్వేచ్ఛగా మాట్లాడనివ్వకుండా ఎక్కడికక్కడే గొంతునొక్కే ప్రయత్నం ఓ యజ్ఞంలా సాగుతున్నదని తెలంగాణవాదులు వాపోతున్నారు.
గ్రామాల్లోని బీఆర్ఎస్ కార్యకర్తలు మొదలు, పార్టీ అధినేత వరకు ఏం మాట్లాడినా అక్రమంగా కేసులు పెట్టించడమే కాంగ్రెస్ నాయకులు పనిగా పెట్టుకున్నారని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. ఇటీవల కేసీఆర్ మాట్లాడిన మాటలను సైతం వక్రీకరించి ఫిర్యాదుచేసి ఎలక్షన్ కమిషన్తో 48 గంటలు ప్రచారాన్ని ఆపించగలిగారని, తాజాగా సీఎం చేసిన ఫేక్ పోస్టును ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ను ఏకంగా అరెస్టు చేశారని అంటున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే క్రిశాంక్పై ఆరు కేసులు నమోదు చేయడం అత్యంతహేయమని విద్యార్థి నేతలు వాపోతున్నారు. సీఎం ఫేక్ ప్రచారాన్ని, అక్రమ కేసులను వదిలిపెట్టేది లేదని, కోర్టుల్లో పో రాడుతానని క్రిశాంక్ తెలిపారు.
ప్రశ్నకు జవాబు చెప్పలేక బీఆర్ఎస్ కార్యకర్తలను హత్యలు చేయించే స్థాయికి కాంగ్రెస్ దిగజారిందని పార్టీశ్రేణులు వాపోతున్నాయి. బోగుడతండాలో రోడ్డు నిర్మాణంపై ఘర్షణ పడి బీఆర్ఎస్ కార్యకర్తనుహత్య చేశారని ఆరోపించాయి. నాగర్కర్నూల్ జిల్లా గండ్రావుపల్లిలో చిక్కేపల్లి మల్లేశ్ హత్య ఉదాంతం మర్చిపోలేమని అంటున్నాయి. ధర్మపురిలో బీఆర్ఎస్ కార్యకర్త మాధవ్పై హత్యాయత్నం చేశారని అంటున్నాయి.
గత మార్చిలో సీఎం రేవంత్రెడ్డిపై ‘ఆర్ ట్యాక్స్’ వసూలు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించిన వెంటనే ఆయనపై పలుచోట్ల 504, 505 సెక్షన్ల కింద జీరో ఎఫ్ఐఆర్లు నమోదు చేయించారు. ఇప్పుడు ‘డబుల్ ఆర్’ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఏకంగా ప్రధాని మోదీ ఆరోపించినా ఎలాంటి చర్యలూ లేవని బీఆర్ఎస్ నేతలు ఫైరవుతున్నారు. నాడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డిపై చర్యలు చేపట్టాలని ఆర్టీసీ, విద్యుత్తుశాఖల నుంచి నోటీసులు ఇప్పించారని, మాజీ మం త్రి మల్లారెడ్డిపై ఏకంగా భూ కబ్జా కేసులు పెట్టించారని గుర్తుచేశారు. సీఎం వ్యాఖ్యలకు చెప్పుతో కౌంటర్ ఇచ్చిన బాల్క సుమన్పై అక్రమ కేసులు పెట్టారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు మరికొందరిపై కేసులు నమోదుకు డీజీపీకి లేఖలిచ్చారని గుర్తుచేస్తున్నారు.