KP Vivekananda | బండి సంజయ్, రేవంత్ రెడ్డి మధ్య చీకటి ఒప్పందం ఉందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఆపద వచ్చినప్పుడల్లా బండి సంజయ్ కాపాడుతున్నాడని తెలిపారు. కరీంనగర్ దాడి వెనుక రేవంత్ రెడ్డి సహకారం ఉందని ఆరోపించారు.
కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంపై దాడి చేసి, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కారును ధ్వంసం చేసిన బీజేపీ నాయకులపై రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్కు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. డీజీపీని కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, దేశపతి శ్రీనివాస్ వినతిపత్రం అందజేశారు. అనంతరం కేపీ వివేకానంద మీడియాతో మాట్లాడుతూ.. 2014కు ముందు బండి సంజయ్ చందాలతో బతికేవాడని అన్నారు. కానీ ఇప్పుడు అహంకారపూరితంగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. మీరు మాట్లాడిన భాషలోనే మీకు సమాధానమిచ్చామని తెలిపారు.
పాడి కౌశిక్ రెడ్డిపై పథకం ప్రకారమే దాడి జరిగిందని కేపీ వివేకానంద తెలిపారు. కౌశిక్ రెడ్డిపై హత్యకు సామాగ్రితో వచ్చారని పేర్కొన్నారు. ఇలాంటి సంస్కృతిని కొనసాగిస్తే.. రెండున్నరేళ్ల తర్వాత బండి సంజయ్ గుజరాత్, యూపీకి వెళ్లి బతకాల్సి వస్తుందని హెచ్చరించారు. పదేళ్లలో తాము ఎంతో ఓపికగా ఉన్నామని తెలిపారు. అన్ని ఆధారాలతో డీసీపీకి ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని పేర్కొన్నారు. పాడి కౌశిక్ రెడ్డి కారు ధ్వంసం కేసులో బండి సంజయ్ను ఏ1గా చేర్చాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్పై పరువు నష్టం దావా వేస్తామని తెలిపారు.