హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): రైతు రుణమాఫీ, ఆరు గ్యారెంటీలను ఆగస్టు 15లోగా అమలు చేయకుంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని రేవంత్రెడ్డి ప్రకటించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద డిమాండ్ చేశారు. రేవంత్ రాజకీయ ప్రస్థానమే అబద్ధాల పునాదుల మీద మొదలైందని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి హరీశ్రావు సవాల్ను రేవంత్రెడ్డి స్వీకరించలేకపోతున్నారని, మాటల గారడీలతో ప్రజలను మభ్య పెడుతున్నారని దుయ్యబట్టారు. శనివారం ఆయన తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రేవంత్రెడ్డి ప్రజావిశ్వాసం కోల్పోయారని విమర్శించారు.
ఎక్కువ ఎంపీ స్థానాలు గెలుచుకోలేకపోతే, సీఎం పదవికి ఎసరు వస్తుందన్న భయంతోనే దేవుళ్ల మీద ఒట్లు పెడుతున్నారని మండిపడ్డారు. హరీశ్రావు అంటే ప్రజల్లో నమ్మకం ఉన్నదని, ఆయన రాజీనామా సవాల్ను ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు. రేవంత్కు చిత్తశుద్ధి ఉంటే తన రాజీనామా పత్రాన్ని తనకు ఇష్టమైన వ్యక్తి దగ్గర పెట్టాలని సవాల్ చేశారు. కొడంగల్లో ఎమ్మెల్యేగా ఓడిపోతే, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిన రేవంత్ రెండుసార్లూ మాట తప్పారన్నా రు. టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లేటప్పుడు రేవంత్ రాజీనామా లేఖను స్పీకర్కు కాకుండా చంద్రబాబుకు పంపారని గుర్తుచేశారు. హరీశ్రావు రాజీనామాపై మాట్లాడే ముందు రేవంత్ తన గతాన్ని గుర్తు చేసుకోవాలని హితవు పలికారు.