ఆసిఫాబాద్: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాపరిషద్ చైర్పర్సన్ పదవికి ఎమ్మెల్యే కోవ లక్ష్మీ (Kova Lakshmi) రాజీనామా చేశారు. దీంతో ఆమె స్థానంలో జడ్పీ చైర్మన్గా కోనేరు కృష్ణారావు బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా కోవ లక్ష్మీ విజయం సాధించిన విషయం తెలిసిందే.
1995లో తిర్యాణి మండలం పండిగి మాదర ఎంపీటీసీ స్థానానికి మొదటిసారి నిలబడి గెలిచింది. 2001లో పండిగి మాదర నుంచి మరోసారి ఎంపీటీసీగా గెలిపొందింది. 2002లో తిర్యాణి మండల ఎంపీపీగా సేవలు అందించారు. అనంతరం ఆసిఫాబాద్ పట్టణ సర్పంచ్గా 2006లో గెలుపొందారు. మరోసారి 2013లోనూ ఆసిఫాబాద్ సర్పంచ్గా గెలిపొందారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో 2014లో మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఏడాది పాటు తెలంగాణ ప్రభుత్వ పార్లమెంటరీ కార్యదర్శి (రాష్ట్ర వ్యవసాయ సహాయ మంత్రిగా) పని చేశారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 171 ఓట్లతో ఓటమిని చవి చూశారు. 23 యేండ్లపాటు ఓటమి లేకుండా ఏ ఎన్నికలు వచ్చినా విజయమే ఆమె సొంతం అయ్యింది. మొదటి సారి ఓటమి కావడంతో నిరాశలో ఉండగా, కేసీఆర్ స్వయంగా జడ్పీ చైర్పర్సన్గా ప్రకటించారు. 2019 జూన్లో జరిగిన ఎన్నికల్లో జడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కుమ్రంభీం జిల్లాకు జడ్పీ చైర్పర్సన్గా ప్రాతినిథ్యం వహిస్తున్న క్రమంలో ముడో సారి ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి 22,810 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి శ్యాంనాయక్పై గెలుపొందారు.