భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు విజయం ఖాయమని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ధీమా వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ కొత్తగూడెం ఎన్నికల ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత సోమవారం ఆయన తొలిసారి నియోజకవర్గానికి వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా గులాబీ శ్రేణులతో కలిసి సుజాతనగర్ మండలం నాయకులగూడెం వద్ద వద్దిరాజుకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి కొత్తగూడెం మీదుగా పాల్వంచ మండలంలోని పెద్దమ్మగుడి వరకు కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. డప్పు చప్పుళ్లు, గిరిజన కళాకారుల నృత్య ప్రదర్శనల నడుమ ర్యాలీ కొనసాగింది. నాయకులకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ‘జై కేసీఆర్.. జై వనమా’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. అన్ని సర్వేలు వనమాకే అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెంలో బీఆర్ఎస్ను గెలిపించి, ముఖ్యమంత్రి కేసీఆర్కు కానుకగా ఇస్తామని అన్నారు. ఎంతమంది ఎన్ని కుయుక్తులు పన్నినా వనమా విజయాన్ని అడ్డుకోలేరని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో మళ్లీ టికెట్ ఇచ్చిన సీఎం కేసీఆర్కు ధన్యావాదాలు తెలియజేశారు. వార్డు మెంబర్ స్థాయి నుంచి ఎదిగానని, ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశానని చెప్పారు. ఇప్పటికే కొత్తగూడెం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నిలిపానని వివరించారు. సమావేశంలో జడ్పీ వైస్చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు, కొత్తగూడెం మున్సిపల్ చైర్మన్ కాపు సీతాలక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, డీసీఎంఎస్ వైస్చైర్మన్ కొత్వాల శ్రీనివాస్, ఎంపీపీలు శాంతి, సోనా తదితరులు పాల్గొన్నారు.
మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి మద్దతుగా పలు కుల సంఘాలు తీర్మానాలు చేశాయి. సోమవారం నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం బడా భీమ్గల్ గ్రామానికి చెందిన కుమ్మరి (మున్నూరుకాపు) సంఘానికి చెంది న 46 కుటుంబాలు, బాల్కొండ మండలం చిట్టాపూర్ గోపాలకృష్ణ కుర్మ సంఘానికి చెందిన 41, మల్లన్న కుర్మ సంఘానికి చెందిన 34 కుటుంబాలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి ఓటు వేస్తామని ఏకగ్రీవ తీర్మానం చేశాయి. సమావేశంలో వైస్ ఎంపీపీ భూమేశ్వర్, సర్పంచ్ సంజీవ్, ఉపసర్పంచ్ బాల్రెడ్డి, వీడీసీ అధ్యక్షుడు లింబాద్రి తదితరులున్నారు.
– భీమ్గల్/బాల్కొండ