Congress | హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణ… గత పదేండ్లుగా శాంతిభద్రతలు-అభివృద్ధి-సంక్షేమం అనే పదాలకు నిర్వచనంగా దేశవ్యాప్తంగా మార్మోగుతున్న పేరు. 13 ఏండ్ల తెలంగాణ ఉద్యమంలో లెక్కకు మించిన సిరా ఇంకు చుక్కలతో ఢిల్లీ మెడలు వంచిందే తప్ప… ఏ ఒక్కనాడూ ఒక్క రక్తపు చుక్కను కూడా నేలరాలనీయని గడ్డ ఇది. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయ హడావిడి కనబడే రాష్ట్రంలో పోలింగ్ మరుసటిరోజు నుంచే ప్రగతి, ప్రజాసంక్షేమం పైనే ప్రధాన దృష్టి నెలకొంటుంది.
అందుకే చిన్న రాష్ట్రమైనా అనతికాలంలోనే తెలంగాణ అన్నిరంగాల్లో దేశానికే దిక్సూచిలా నిలిచింది. కానీ రెండురోజుల క్రితం ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్త కత్తిపోట్లకు పాల్పడిన ఘటనతో తెలంగాణ ఉలిక్కిపడింది. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన దుండగుడి అసలు కండువా రంగును చూసి కలవరపడుతున్నది. పచ్చటి తెలంగాణలో ఎక్కడిదీ నెత్తుటి రాజకీయం? ఎక్కడిదీ విషసంస్కృతి? అన్న చర్చ మొదలైంది. కత్తిపోట్ల ఉదంతంతో ప్రజలు గతాన్ని జ్ఞప్తి చేసుకుంటున్నారు. కుర్చీలాటలో కాంగ్రెస్ నెత్తుటి కోలాటాలాడిన రోజుల్ని గుర్తుచేసుకుంటున్నారు. గాంధీగిరి నుంచి గుండాగిరి వైపు శరవేగంగా దిగజారి నెత్తుటి సిరాతో రాసిన హస్తాక్షర పుటలు ఆందోళన కలిగిస్తున్నాయి.
కర్ఫ్యూలు.. కన్నీళ్లు
ముఖ్యమంత్రి కుర్చీ కోసం కాంగ్రెస్లోని ప్రత్యర్థులే హైదరాబాద్ నడిబొడ్డున సాగించిన నరమేధం ఇప్పటికీ కండ్లముందు కదలాడుతున్నది. బాబ్రీ మసీదు ఘటనతో హైదరాబాద్ నగరం కర్ఫ్యూ నీడలో గజగజా వణికిపోయింది. 1990 డిసెంబర్నాటి దుర్దినాల వెనుక అధికార దాహం దాగి ఉన్నదని సాక్షాత్తూ అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ప్రకటించడం పాత పత్రికల ప్రతుల్లో పదిలంగానే ఉన్నది. హిందువును నరికిన అదే కత్తితో ముస్లిం సోదరుడిని సైతం పొట్టన పెట్టుకున్న అప్పటి ‘సృష్టించబడిన మత కల్లోలం (ఇంజినీర్డ్ వాయ్లెన్స్)’ కారణంగానే మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి కుర్చీని వీడాల్సి వచ్చిందని కాంగ్రెస్ సీనియర్లు, బుద్ధిజీవులు పలు సందర్భాల్లో గుర్తుచేస్తూ ఉంటారు. కాంగ్రెస్లో అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారనేందుకు ఇదే చారిత్రక రుజువు.
గతమంతా తడిసె రక్తమున..
వంగవీటి రంగా హత్య సమయంలో విజయవాడ, ఉభయ గోదావరి జిల్లాల్లో చెలరేగిన హింసాత్మక ఘటనలు, అల్లర్లు.. సంబంధం లేని హైదరాబాద్ నగరానికీ వ్యాపింపచేశారు. వనస్థలిపురం సమీపంలో కాంగ్రెస్ నాయకులు డబుల్ డెక్కర్ బస్సును దగ్ధం చేశారు. ఒక రాజకీయ నాయకుడి మరణం.. శాంతిభద్రతల విఘాతానికి దారితీయడం అప్పటివరకు తెలంగాణ ఎన్నడూ చూడలేదు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడే.. జూబ్లీహిల్స్లో బాంబుపేలుళ్లు జరిగాయి. 1997 నవంబర్ 20న టీడీపీకి చెందిన మాజీ మంత్రి పరిటాల రవిని హతమార్చేందుకు ఆయన ప్రత్యర్థులు మాటువేసి అమలు చేసిన బాంబు పేలుళ్లలో ఏకంగా 23 మంది చనిపోయారు. అప్పటివరకు హైదరాబాద్ నగరానికి ఫ్యాక్షన్ సంస్కృతి వాసనలేవీ తెలియవు.
అధికారం కోసం ఎంతకైనా..
రాష్ట్రమేదైనా అధికారం కోసం కాంగ్రెస్ ఎంతకైనా తెగబడుతుందనడానికి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. కర్ణాటకలో 1989 ఎన్నికల్లో లింగాయత్ వర్గానికి చెందిన మాజీ సీఎం వీరేంద్రపాటిల్ సిరహట్టి నుంచి గెలిచి, రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో పెరుగుతున్న లిక్కర్ లాబీయింగ్ను నియంత్రించేందుకు ఎక్సైజ్ సుంకాన్ని 2 నుంచి 20 శాతానికి పెంచారు. ఇది సొంతపార్టీలోని పైరవీకారులకు నచ్చలేదు. వీరేంద్రపాటిల్ను గద్దెదించడమే లక్ష్యంగా మత ఘర్షణలు సృష్టించారు. ఫలితంగా 11నెలలైనా గడవకముందే పాటిల్ సీఎం పీఠం నుంచి దిగిపోవాల్సి వచ్చింది. రెండు పర్యాయాలు కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసి, కాంగ్రెస్కు ఎనలేని సేవలు చేసిన తనను ఇలా అవమానించడం తట్టుకోలేక పదవీచ్యుతుడైన పాటిల్ అదేసమయంలో గుండెపోటుకు గురయ్యారు.
కేసీఆర్ పాలనలో పదేండ్లు ప్రశాంతంగా..
తెలంగాణ ఏర్పడిన ఈ పదేండ్ల కాలంలో కరువు లేదు, కర్ఫ్యూ లేదు. ఎన్నికలవేళ ప్రజాక్షేత్రంలో రాజకీయ విమర్శలు, పరస్పర ఆరోపణలే తప్ప పదేండ్లలో రాష్ట్రంలో చిన్న ఉద్రిక్త ఘటన కూడా చోటుచేసుకోలేదు. అనునిత్యం అభివృద్ధి, సంక్షేమం అంటూ ప్రభుత్వయంత్రాంగాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అలుపెరుగక పరుగులు పెట్టించడం అందుకు కారణం. తెలంగాణ గాయాలను మాన్పేందుకు నీళ్లు ఎలా తేవాలి? నిధులు ఎలా సమీకరించాలి? వలసలను ఎలా నిర్మూలించాలి? ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎలా పెంచాలి? ప్రతిక్షణం పాలకుడు ఈ ఆలోచనలతో ఉంటే.. ప్రజలు మరోవైపు ఎలా చూస్తారు? అందుకు ప్రజల సంపూర్ణ సహకారంతో తెలంగాణ పోలీసింగ్ కొత్త శిఖరాలకు చేరింది.
రాష్ట్రం ప్రశాంతంగా ఉన్నది కాబట్టే పెట్టుబడులు వెల్లువలా తరలివచ్చాయి.అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు అమెరికా ఆవల తమ రెండో క్యాంపస్ను తెలంగాణలో ఏర్పాటు చేయడానికి ఈ శాంతియుత వాతావరణమే కారణం. అయితే ఈ ప్రశాంత వాతావరణం పదేండ్లకే పలుచబడొద్దు. భవిష్యత్తులోనూ శాంతిభద్రతలకు భరోసా ఇస్తారన్న నమ్మకం ఉంటేనే ప్రగతి యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగుతుందన్నది నిర్వివాదాంశం. నాలుగు ఓట్ల వేటలో రాజకీయ కక్షలకు తెలంగాణ ఆగం కావొద్దని, అద్దాల మేడపై చిన్న రాయి పడినా పగుళ్లు తప్పవని మేధావులు హెచ్చరిస్తున్నారు. అయితే రాష్ర్టాన్ని పదిలంగా చూసుకోవడం అనేది ప్రజల చేతుల్లోనే ఉందని వారు గుర్తు చేస్తున్నారు.