హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్, బీజేపీ నుంచి చెరో ఎనిమిది మంది ఎంపీలున్నా కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి సాధించింది గుండు సున్నా అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర ప్రజలను నిరాశపరిచిందని స్పష్టంచేశారు. సుమారు రూ. 54 లక్షల కోట్ల బడ్జెట్లో తెలంగాణకు మొండిచెయ్యి చూపిందని విమర్శించారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ అసమర్థత, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వివక్షతో తెలంగాణకు ఒరిగిందేమీలేదని విమర్శించారు. విభజన చట్టంలో పేర్కొన్న ఏ ఒక్క హామీని నెరవేర్చే దిశగా యత్నించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. ఐఐఎం, నవోదయ, సెంట్రల్ స్కూల్స్ మంజూరు చేయకపోవడం దురదృష్టకరమని, రాష్ట్రానికి చెందిన ఇద్దరు కేంద్రమంత్రులు ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అయ్యాక 62 సార్లు ఢిల్లీకి వెళ్లిన రేవంత్రెడ్డి సాధించిందేమీలేదని దెప్పిపొడిచారు. కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ ఎంపీలు పోరాడి నిధులు సాధించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్లో గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి తీవ్ర అన్యాయం జరిగిందని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ధర్మానాయక్, శ్రీరాంనాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వికసిత్ భారత్ అంటూ గిరిజనులను మరింత పేదరికంలో నెట్టేలా బడ్జెట్ కేటాయింపులున్నాయని విమర్శించారు.
నిరుడు బ డ్జెట్లో గిరిజన సంక్షేమానికి రూ.14,925 కోట్లు కేటాయిస్తే, సవరించిన అంచనాల్లో రూ.4,101 కోట్లు తగ్గించి కేవలం రూ.10,824 కోట్లకే పరిమితం చేసి గిరిజనులను మోసం చేశారని మండిపడ్డారు. 2026-27 బడ్జెట్లో రూ.15,421 కోట్ల కేటాయింపులు చేసి, గత బడ్జెట్ కంటే కేవలం రూ.496 కోట్లు మాత్రమే పెంచిందని, ఇంత పేలవమైన బడ్జెట్తో దేశంలోని 15 కోట్ల మంది ఆదివాసీ గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి ఎలా సాధ్యమో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం పథకాలకు పేర్లు మార్చడం తప్ప, గిరిజనులకు చేసింది ఏమీ లేదని మండిపడ్డారు.