ధర్మారం, జూలై 20: ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచే మంత్రి కొప్పుల ఈశ్వర్ మరోసారి పెద్దమనసు చాటుకొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన బాధితులకు అం డగా నిలిచారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలోని నష్టపోయిన గంగపుత్రులు, మత్స్యకారులను ఈ నెల 14న మంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా అందరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఒక్కొక్కరికీ రూ.5 వేల చొప్పున 50 మందికి వ్యక్తిగతంగా రూ. 2.50 లక్షల సాయం అందజేశారు. బుధవారం స్థానిక టీఆర్ఎస్ నాయకులు ఇంటింటికీ తిరిగి సాయం మొత్తాన్ని పంపిణీ చేశారు. ఆపద కాలంలో సాయం చేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్కు బాధిత కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపాయి.