జగిత్యాల : రాష్ట్రంలోని మత్స్యకారులను లక్షాధికారులుగా చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మందుకెళ్తోందని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. అందుకోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా సమీకృత మత్స్య అభివృద్ధి పథకం చేపట్టిందని కొప్పుల తెలియజేశారు. మత్స్యకారులకు 100 శాతం సబ్సిడీపై చేప పిల్లల పంపిణీ చేయడంతో తెలంగాణ ఫిష్ హబ్ గా మారుతోందని తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కమలాపూర్ (వెల్లొండ) గ్రామంలోని బోలి చెరువులో మంత్రి లక్ష ముప్ఫై వేల రొయ్య పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కుల వృత్తులకు ఉపాధి కల్పించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చేపలు ఎగుమతి చేయడం ద్వారా ముదిరాజ్ కులస్తులు, గంగ పుత్రులు ఆర్థికంగా మెరుగుపడుతున్నారని మంత్రి అన్నారు. తమ ప్రభుత్వం మత్స్యకారులకు రాయితీపై వాహనాలు, వలలు, తెప్పలు, ఇతర సామాగ్రిని అందజేస్తున్నదని మంత్రి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సొసైటీలను ఏర్పాటు చేసి నూతన భవనాలను మంజూరు చేస్తున్నట్లు తెలియజేశారు. సొసైటీల్లో ఉన్న మత్స్యకారులకు రిజర్వాయర్లు, ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో చేపలు పట్టుకోవడానికి అనుమతి ఇస్తున్నామని కొప్పుల చెప్పారు.
బీజేపీకి ఓటేస్తే భవిష్యత్ అంధకారమే
సీఎం కేసీఆర్ చేపట్టిన రైతు సంక్షేమ కార్యక్రమాల వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చాలా మెరుగుపడిందని కొప్పుల ఈశ్వర్ తెలిపారు. మోదీ ప్రభుత్వం రూపొందించిన నూతన వ్యవసాయ చట్టాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని, ఆ చట్టాల్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీకి ఓటేస్తే భవిష్యత్తు అంధకారం అవుతుందని కొప్పుల అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఒక్కటైనా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారా? అని మంత్రి ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్, డీసీఎంఎస్ ఛైర్మన్ ఎల్లాల శ్రీకాంత్, బుగ్గారం జెడ్పీటీసీ బాదినేని రాజేందర్, ధర్మపురి జెడ్పీటీసీ బత్తిని అరుణ, ఎంపీపీ చిట్టిబాబు, బుగ్గారం వైస్ ఎంపీపీ సుచెందర్, సర్పంచ్, తదితరులు పాల్గొన్నారు.