హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): దళితబంధు పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయాలని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. ఈ పథకం అమలుపై ఆయన మంగళవారం ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్తో కలిసి హైదరాబాద్లో సమీక్ష నిర్వహించారు. అధికారులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ పథకాన్ని పక్కాగా అమలు చేయాలని సూచించారు. కిందిస్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయని, వెంటనే అడ్డుకోవాలని ఆదేశించారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీలు ఫీల్డ్లో తిరగాలని, లబ్ధిదారులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. లబ్ధిదారులకు అందజేసిన ప్రతి యూనిట్ పక్కాగా నడిచేలా చూడాలని కోరారు. వారికి ప్రతి నెలా ఎంత ఆదాయం వస్తున్నదో తెలుసుకోవాలని ఆదేశించారు. దళితబంధులో అమలు చేస్తున్న కొన్ని యూనిట్లు అద్భుతంగా ఉన్నాయని, వాటి గురించి మరింత అధ్యయనం చేయాలని చెప్పారు. ఆవులు, బర్రెలను ఎంపిక చేసుకున్న లబ్ధిదారులకు వాటి పెంపకం, ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు పశు వైద్యులతో సలహాలు సూచనలు చేయాలని సూచించారు. అధికారులు నిరంతరం క్షేత్ర స్థాయిలో తిరుగుతూ పని చేయాలని, లేదంటే చర్యలు తప్పవరి హెచ్చరించారు.