హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): బీజేపీ పాలన దేశ సమైక్యతకు, సమగ్రతకు గొడ్డలిపెట్టులా మారిందని రాష్ట్ర ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. ఎనిమిదేండ్ల పాలనలో దేశ రాజకీయాలను ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షా భ్రష్టుపట్టించారని మండిపడ్డారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా విష సంస్కృతిని మరింతగా పెంచుతున్నారని ఆదివారం ఒక ప్రకటనలో కొప్పుల ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ పాలనలో దేశ జీడీపీ ఘోరంగా దెబ్బతిన్నదని తెలిపారు. సహజ వనరుల వినియోగంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని, వ్యవసాయంతోపాటు విద్య, వైద్యరంగాలను మోదీ గాలికి వదిలేశారని మండిపడ్డారు.
ఈడీ, ఐటీ సంస్థలతో విపక్షాలపై బీజేపీ సరార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నదని విమర్శించారు. అందుకే దేశ ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. మత సామరస్యానికి తెలంగాణ ప్రతీకగా నిలుస్తున్నదని కొనియాడారు. అన్ని మతాల పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణేనని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనిమిదేండ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకుపోతున్నదని, ప్రజల భద్రత, సంక్షేమం, సహజ వనరుల వినియోగం, మౌలిక వసతుల కల్పన వంటి అన్నిరంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని కొనియాడారు.