ధర్మారం, అక్టోబర్ 4: బాధ్యతాయుతమైన అత్యున్నత పదవిలో ఉన్న ప్రధాని మోదీ అబద్ధాలతో ప్రజలను తప్పుదోవపట్టించేందుకు యత్నిస్తున్నారని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. నిజామాబాద్ సభలో మోదీ కొన్ని సామాజిక వర్గాలను బీఆర్ఎస్కు దూరం చేసేందుకు అర్థరహిత వ్యాఖ్యలు చేశారని ఫైరయ్యారు. సీఎం కేసీఆర్ ఎన్డీయేలో చేరేందుకు తనను కలిశారని మోదీ చెప్పడం పూర్తి అబద్ధమని అన్నారు. కేటీఆర్ను సీఎం చేయాలంటే కేసీఆర్కు ప్రధాని మోదీతో పనేమున్నదని విమర్శించారు.
బుధవారం పెద్దపల్లి జిల్లా ధర్మారంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. పార్లమెంట్లో పలుమార్లు తెలంగాణ ఏర్పాటుపై విషం చిమ్మిన ప్రధాని ఏ ముఖం పెట్టుకొని ఇక్కడికి వచ్చారని ప్రశ్నించారు. దేశంలో రోజురోజుకూ బీజేపీ ప్రభ తగ్గిపోతుండటంతో ఆయన దిక్కుతోచని స్థితిలో ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. సెక్యులర్ పార్టీ అయిన బీఆర్ఎస్ మతతత్వ శక్తులతో కలువబోదని స్పష్టంచేశారు.