జమ్మికుంట, అక్టోబర్ 12: తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండటాన్ని బీజేపీ పార్టీ ఓర్వలేక పోతున్నదని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీకి ఓటేస్తే నష్టపోతామని తెలిపారు. మంగళవారం జమ్మికుంటలోని 8వ వార్డు మారుతీనగర్లో మంత్రి పర్యటించారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు సీనుకు ఓటేయ్యాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు. అనంతరం కాలనీ ప్రజలతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఈటల పార్టీలో చేరినప్పుడు, ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కొత్తవాడేనని.. తర్వాత ఆయనకు సీఎం కేసీఆర్ ఇచ్చిన అవకాశాలవల్ల ఎదిగాడని చెప్పారు. పదవులన్నీ అనుభవించి నమ్మక ద్రోహం చేసి పార్టీ నుంచి వెళ్లిపోయాడని మండిపడ్డారు. మరో రెండున్నరేళ్లు ప్రజలకు సేవ చేసే అవకాశం ఉన్నా రాజీనామా చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.