హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): ప్రధానమంత్రి నరేంద్రమోదీ తొమ్మిదేండ్ల పాలనలో తెలంగాణకు, ఖమ్మం జిల్లాకు ఏం చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనకు వస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు. మంగళవారం హైదరాబాద్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్ధూం భవన్లో పార్టీ నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..
అమిత్ షా ఖమ్మం పర్యటనకు వస్తూ వలలు తీసుకొస్తున్నారని, వాటిలో చివరికి పాములు కూడా పడవని ఎద్దేవా చేశారు. ఈ తొమ్మిదేండ్లలో తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. షా పర్యటనను సీపీఐ వ్యతిరేకిస్తున్నదని అన్నారు. బీజేపీ నేతలు తలకిందులుగా తపస్సు చేసినా రాష్ట్రంలో ఒక్కచోటు కూడా గెలవలేరని తేల్చిచెప్పారు.