కరీంనగర్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): కరీంనగర్ జిల్లా సహకార బ్యాంకు మరోసారి జాతీయస్థాయిలో మెరిసింది. ఈ దశాబ్దపు ఉత్తమ బ్యాంకు అవార్డును అందుకొన్నది. శుక్రవారం ఢిల్లీలో జరిగిన గ్రామీణ సహకార బ్యాంకుల సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా చేతుల మీదుగా బ్యాంకు అధ్యక్షుడు, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, సీఈవో ఎన్ సత్యనారాయణరావు పురస్కారాన్ని అందుకున్నారు. 2005-06 ఆర్థిక సంవత్సరంలో రూ. 57.92 కోట్ల సంచిత నష్టాల్లో కురుకుపోయిన ఈ బ్యాంకు 2012-13 నుంచి లాభాల బాటలో పయనిస్తున్నది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 1,207 గ్రామాల్లో 7.68 లక్షల ఖాతాదారులకు మెరుగైన సేవలందిస్తున్నది. 2012లో వాటాధనం రూ. 62 కోట్లు ఉండగా పస్తుతం రూ.346 కోట్లకు పెరిగింది. రూ. 271.30 కోట్ల డిపాజిట్లు ఉండగా ప్రస్తుతం రూ. 2,263.68 కోట్లకు వృద్ధి చెందింది. ఈ నేపథ్యంలో 2015-16 నుంచి 2019-20 వరకు వరుసగా ఐదేండ్లపాటు దేశంలోనే అత్యుత్తమ జిల్లా సహకార బ్యాంకుగా అవార్డులు పొందింది.