Kondagattu | మల్యాల, మార్చి 17: కొండగట్టు అంజన్న క్షేత్రంలో దుకాణాల లీజు సొమ్ముల వసూళ్లలో రూ.11.20 లక్షల గోల్మాల్ జరిగింది. దుకాణాదారుల నుంచి వేలం డబ్బులు వసూలు చేసి, ఆలయానికి చెల్లించకుండానే సదరు నిర్వాహకులకు నో డ్యూస్ సర్టిఫికెట్లు జారీ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొండగట్టు అంజన్న క్షేత్రంలో పలు రకాల వస్తువులు అమ్ముకునేందుకు ఏటా దుకాణాల నిర్వహణ హక్కులను వేలం వేస్తుంటారు. కొబ్బరి కాయలు, పూలు, పండ్లు, పాదరక్షల సేకరణ, టెంట్ హౌస్ నిర్వహణ, వంట చెరుకు విక్రయం, హోటల్, సులభ్ కాంప్లెక్స్ నిర్వహణ, భక్తులు కొట్టిన కొబ్బరి కాయల ముక్కల సేకరణకు సంబంధించిన హక్కులను ఏడాది కాలపరిమితితో టెండర్లు నిర్వహించి ఎక్కువ కోట్ చేసిన వారికి కట్టబెడతారు. హక్కులు దక్కించుకున్నవారు దుకాణం ప్రారంభ సమయానికి ముందుగానే నిర్ణీత వేలం సొమ్ములో 50 శాతం చెల్లించి దుకాణం పొందాల్సి ఉంటుంది. దుకాణం పొందిన నెల రోజుల వ్యవధిలోపే మిగతా 50 శాతం చెల్లించాలనే నిబంధన ఉన్నది. కొన్నేండ్లుగా దుకాణదారుల నుంచి లీజు మొత్తాలను వసూలు చేయడంలో ఆలయ అధికారులు జాప్యం చేస్తున్నారు.
అంజన్న క్షేత్రంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి నాలుగు దుకాణాలకు సంబంధించి లీజు సొమ్ము పక్కదారిపట్టింది. దుకాణాదారుల నుంచి లీజు సొమ్ము రూ.11.20 లక్షలు ఆలయ సిబ్బంది వసూలు చేశారు. ఆ డబ్బును బ్యాంక్లో జమచేయలేదని, వాటి వివరాలను ఆలయ నగదు పుస్తకంలో నమోదు చేయలేదని తెలిసింది. అక్కడితో ఆగకుండా సదరు దుకాణాదారులు 2023-24కు దుకాణాల లీజు వేలంలో పాల్గొనేందుకు నో డ్యూస్ సర్టిఫికెట్లను సైతం జారీ చేసిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. డబ్బులు వసూలైనట్టు డిమాండ్ కలెక్షన్ బుక్, నోట్ఫైల్లో కిందిస్థాయి సిబ్బంది సంతకాలు చేసి మరీ ఈవోతో నో-డ్యూస్ సర్టిఫికెట్లు జారీ చేయించినట్టు తెలుస్తుండగా, ఈ విషయాన్ని ఉన్నతాకారులు సీరియస్గా తీసుకున్నట్టు తెలిసింది. ఇప్పటికే 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను పలు దుకాణాల నుంచి నగదును వసూలు చేసి ఆలయానికి జమచేయని విషయంలో ఓ ఉద్యోగిని సస్పెండ్ అయిన ఘటన మరువక ముందే తాజాగా రూ.11.20 లక్షలు స్వాహా విషయం బయటపడటం కలకలం రేపుతున్నది.
అంజన్న ఆలయ ఉద్యోగుల అవినీతిని ఉపేక్షించేది లేదు. ఇప్పటికే రూ.37.90 లక్షల స్వాహా విషయంలో ఒకరిని సస్పెండ్ చేయడంతోపాటు క్రిమినల్ కేసు పెట్టాం. తాజాగా రూ.11.20 లక్షల స్వాహా విషయం బయటపడింది. పద్దు పుస్తకాలను పరిశీలించి, దేవాదాయ కమిషనర్కు నివేదించి బాధ్యులపై తగు చర్యలు తీసుకుంటాం.
– టంకశాల వెంకటేశం, ఆలయ ఈవో, కొండగట్టు అంజన్న దేవస్థానం