హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : ఢిల్లీలోనే మంత్రి కొండా సురేఖ ఢీ అంటే ఢీ అంటున్నారు. నేరుగా సీఎం రేవంత్రెడ్డిపైనే విమర్శనాస్త్రం సంధించారు. ఆయన సంగతి తేల్చిన తర్వాతే తనపై చర్యలు తీసుకోవాలంటూ అధిష్ఠానానికి అల్టిమేటం జారీచేశారు. సీఎం సోదరుల భూదందాల సంగతేందని ప్రశ్నించారు. తన విషయాన్ని ఎందుకు ఇంత పెద్ద వివాదం చేస్తున్నారని.. మరి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిపై వచ్చిన ఆరోపణల సంగతేందని, వారిపై ఏం చర్యలు తీసుకొంటారో చెప్పాలని నిలదీశారు. బుధవారం ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ చేసిన మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం రేవంత్రెడ్డి ఏమైనా సుద్దపూసనా..’ అంటూ ప్రశ్నించారు. ఆయన బ్రదర్స్ చేస్తున్న భూదందాల సంగతేందని ప్రశ్నించారు.
అధిష్ఠానం పెద్దలు తనపై చర్యలు తీసుకోవడానికి ముందు సీఎం రేవంత్రెడ్డిపైనే చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. ఆయన అనేకసార్లు పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారని పేర్కొన్నారు. పదేండ్లపాటు తానే సీఎంనని చెప్పుకోవడం పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన కాదా? ఆయనకు ఏ అధికారం ఉన్నదని ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటిస్తరని ప్రశ్నించారు. ఈ రెండింటితో ఆయనపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఆయన కొడుకుపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయని, వాటికి ఏం సమాధానం చెప్తరు? ఏం చర్యలు తీసుకుంటరు? అని ప్రశ్నించారు. మంత్రులు, ఎమ్మెల్యేలందరిపై వచ్చిన ఫిర్యాదులన్నింటిపై విచారణ జరుపాల్సిందేనని స్పష్టంచేశారు.
బీసీ మహిళనైన తనపై కక్షగట్టి పంతం సాధిస్తున్నారని మంత్రి కొండా సురేఖ ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటివరకు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటిపై చాలా అరోపణలు వచ్చాయని వాటి గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. బీసీ మహిళనైన తనకో న్యాయం, ఇతర సామాజికవర్గాలకు మరో న్యాయమా? అంటూ ప్రశ్నలు సంధించారు. ‘నా భర్త మున్నూరుకాపు, నేను పద్మశాలి. రాష్ట్రంలో ఈ రెండువర్గాలవే 16శాతం ఓట్లు ఉన్నాయి’ అని గుర్తుచేశారు.
పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను, రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షీనటరాజన్ను కలిసి తాను చెప్పదలుచుకొన్నది చెప్పానని, అందులో తన తప్పేమీ లేదని మంత్రి కొండా సురేఖ తెలిపారు. కేసీ వేణుగోపాల్ను కలువాలని అనుకొన్నప్పటికీ ఆయన బిజీగా ఉండటంతో కలువలేకపోయినట్టు తెలిపారు. తన కూతురు మాట్లాడినదానికి తనకు షోకాజ్ నోటీస్ ఎలా ఇచ్చారని తెలిపారు. తన కూతురుకు పెండ్లి అయిందని, ఆమె కుటుంబం ఆమెకున్నదని తెలిపారు. తన కూతురును వద్దని వారించే అధికారం తనకు లేదని చెప్పారు. ఆమె జీవితం ఆమె ఇష్టమని పేర్కొన్నారు. మహిళలు స్వతంత్రంగా మాట్లాడాలంటూ రాహుల్గాంధీ చెప్పిన మాటల స్ఫూర్తితోనే ఈ రోజు తన బిడ్డ కూడా సొంతంగా మాట్లాడి ఉంటుందని తాను భావిస్తున్నట్టు తెలిపారు.
అధిష్ఠానానికి తన బాధను చెప్పుకోవడానికే తాను ఢిల్లీకి వచ్చానని, అధిష్ఠానం పెద్దలను కలిసి చెప్పాలనుకున్నది చెప్పినట్టు కొండా సురేఖ తెలిపారు. తన వాదనను సోనియా, రాహుల్, ప్రియాంకగాంధీకి మెయిల్ ద్వారా పంపానని, కేసీ వేణుగోపాల్కు వాట్సాప్ ద్వారా సమాచారం ఇచ్చానని, ఖర్గే, మీనాక్షికి నేరుగా ఇచ్చినట్టు తెలిపారు. దీనిపై వారు ఆలోచిస్తామన్నారని, ఏ నిర్ణయం తీసుకొంటారో తనకు తెలియదని చెప్పారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో దాన్ని బట్టే తన భవిష్యత్తు నిర్ణయం ఉంటుందని స్పష్టంచేశారు. మంత్రిగా తన బాధ్యతలను సక్రమంగానే నిర్వహిస్తున్నానని, తనపై ఎక్కడా, ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని చెప్పానని తెలిపారు. ప్రజలకు విస్తృతంగా సేవలు చేయాలనే ఆలోచనతోనే తానున్నానని, తనను ఇదే విధంగా పదవిలో కొనసాగించాలని పెద్దలను కోరినట్టు తెలిపారు. పదవికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఖర్గే, మీనాక్షిని తాను కోరానని తెలిపారు.
తాను ఏ తప్పు చేయకుండా తనపై మాట్లాడిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా షోకాజ్ నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారంతా స్వచ్ఛందంగా మాట్లాడలేదని, వారితో ఎవరో బలవంతంగా మాట్లాడించినట్టు తెలిపారు. వారి వెనుక ఎవరు ఉండి మాట్లాడించారో అన్న విషయం తమకు తెలుసని చెప్పారు. అయితే వారి పేరును తాను ఇప్పుడే చెప్పలేననని తెలిపారు. వారి వెనుక ఎవరున్నారనే విషయాన్ని అధిష్ఠానం కనుక్కోవాలని కోరారు. ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల ప్రెస్మీట్ తర్వాత వాళ్లంతా కూడా తనకు ఫోన్ చేసి తమకు ఇష్టంలేదని, పిలిస్తేనే వెళ్లి మాట్లాడినట్టు చెప్పారని తెలిపారు. తాను ఏఐసీసీ సభ్యురాలినని, తనపై ఏమైనా చర్యలు తీసుకోవాలనుకుంటే ఏఐసీసీ తీసుకోవాల్సి ఉంటుందని కొండా సురేఖ తెలిపారు. అసలు తనకు రాష్ట్ర కమిటీ నోటీసులు ఇవ్వడమే తప్పని పేర్కొన్నారు.