హైదరాబాద్, జనవరి 21(నమస్తే తెలంగాణ): క్రమశిక్షణ తప్పిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని ఎందుకు సస్పెండ్ చేయలేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొండా సురేఖ ఆ పార్టీ అధిష్ఠానాన్ని ప్రశ్నించారు. తన తమ్ముడికి ఓటేయాలని వెంకట్రెడ్డి చెప్పడం నూరుశాతం తప్పేనని, అలాంటి వారిపై చర్యలు తీసుకోకపోతే ఎలా అని నిలదీశారు.
ఈ మేరకు శనివారం జరిగిన ఆ పార్టీ సమావేశంలో ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తప్పు చేసినట్టు తెలిసినా చర్యలు తీసుకోకపోతే కార్యకర్తల్లోకి తప్పుడు సంకేతం వెళ్తుందని చెప్పారు. క్రమశిక్షణ తప్పితే ఎంతటి వారినైనా సస్పెండ్ చేస్తారనే భయం ఉండాలని, ఇకపై ఎవరూ అలా మాట్లాడకుండా ఉండేలా అధిష్ఠానం చర్యలు తీసుకోవాలని సురేఖ డిమాండ్ చేశారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డిపై వేటు వేస్తే.. మరెవరూ అలాంటి సాహసం చేయరని, ఇది అందరికీ గుణపాఠం అవుతుందని స్పష్టం చేశారు.