హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ)/రవీంద్రభారతి: తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ మంత్రి కొండా లక్ష్మణ్బాపూజీ 108వ జయంతి వేడుకలు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం రవీంద్రభారతిలో అధికారికంగా నిర్వహించిన వేడుకల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పాల్గొని బాపూజీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సాంస్కృతిక శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తన మంత్రి పదవి తృణప్రాయంగా వదిలేసిన బడుగు, బలహీనవర్గాల స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొండా లక్ష్మణ్ అని చెప్పారు. ఆయన గొప్ప మానవతావాది అని కీర్తించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మహనీయుల జయంతులు, వర్ధంతులను ప్రభుత్వామే అధికారికంగా నిర్వహిస్తున్నదని, ఆ ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని కొనియాడారు. బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు మాట్లాడుతూ.. కొండా లక్ష్మణ్ బాపూజీ బీసీలకు సామాజిక, రాజకీయ రంగాల్లో జనాభా పోరాడిన మహనీయుడని కొనియాడారు.
శాసనసభా ప్రాంగణంలో నివాళులు
తెలంగాణ వైతాళికుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కొనియాడారు. శాసనసభ ప్రాంగణంలో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి గుత్తాతోపాటు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, శాసనమండలి చీఫ్ విప్ భానుప్రసాదరావు, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, శేరి సుభాష్రెడ్డి, సురభి వాణీదేవి, బొగ్గారపు దయానంద్, ఎల్ రమణ ఘనంగా నివాళి అర్పించారు.
ట్యాంక్బండ్ వద్ద నివాళి
ట్యాంక్బండ్పై ఉన్న ఆచార్య కొండా లక్ష్మ ణ్ బాపూజీ విగ్రహానికి మంత్రి శ్రీనివాస్గౌడ్తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.