చేర్యాల, మార్చి 31 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి(Mallanna temple)వారి క్షేత్రం 11వ వారం సందర్బంగా భక్తులతో(Devotees) కిటకిటలాడింది. కొమురవెల్లికి చేరుకున్న భక్తులు స్వామికి వారికి అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడి బియ్యం, కేశ ఖండన, గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టి మొక్కులు తీర్చుకున్నారు.
భక్తులు భారీగా తరలిరావడంతో మల్లన్న ఆలయ ఈవో ఏ.బాలాజీ, కమిటీ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి, అర్చకులు, ఒగ్గు పూజారులు, సిబ్బంది సేవలు అందించారు. కాగా, రాజన్నసిరిసిల్లా జిల్లా తంగెలపల్లికి చెందిన గడ్డం దేవయ్య(భీవండి) అన్నప్రసాద వితరణశాలకు రూ.50,116లు విరాళం అందజేశారు. అలాగే మద్దూరు జెడ్పీటీసీ గిరి కొండల్రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారికి వెండి బిందెను విరాళంగా అందజేశారు.