Komuravelli Mallanna | సిద్దిపేట : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి సందర్భంగా మల్లన్న ఆలయంలో పెద్దపట్నం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. దీంతో ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
లింగోద్భవ కాలంలో ప్రారంభమైన పెద్దపట్నం.. శనివారం వేకువజాము వరకు కొనసాగించారు. ఆలయ అర్చకులు స్వామి వారి ఉత్సవ విగ్రహాలను తీసుకువచ్చి పట్నం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారు పట్నం దాటిన అనంతరం భక్తులు మల్లన్నను దర్శించుకున్నారు. ఒగ్గు పూజారులు భక్తిశ్రద్ధలతో పంచరంగులు కుంకుమ, పసుపు, బియ్యం పిండి, తంగెడు పిండి, గులాలు తదితర వాటి చూర్ణాలను కలిపి ముగ్గులుగా వేసి పట్నంగా తయారు చేశారు.