చేర్యాల, నవంబర్ 25 : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలను డిసెంబర్ 18 నుంచి వచ్చే ఏడాది మార్చి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మల్లన్న కల్యాణ మహోత్సవం వచ్చే నెల 18న జరుగనున్నది. 19న లక్షబిల్వార్చన, జనవరి 22న పట్నం వారం, 23న హైదరాబాద్ భక్తుల పెద్దపట్నం, అగ్నిగుండాలు నిర్వహిస్తారు.
ఫిబ్రవరి 18న పెద్దపట్నం, మార్చి 20న అగ్నిగుండం కార్యక్రమాలుంటాయి. కొమురవెల్లి మల్లన్న జాతర ఏర్పాట్లపై శుక్రవారం జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, సిద్దిపేట అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, ఈవో ఆలూరి బాలాజీ, ఆలయ చైర్మన్ గీస భిక్షపతితో కలిసి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్వామి వారి ఉత్సవాలకు సుమారు 20 లక్షల మంది హాజరుకానున్నందున భారీ ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.