హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బీఆర్ఎస్ను ఓడించడానికి అవసరమైతే కాంగ్రెస్తో చేతులు కలుపుతామని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యానించినట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ మేరకు మంగళవారం సోషల్ మీడియాలో పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. దీనిపై ఇప్పటికే మాజీ ఎంపీలు విజయశాంతి, కొండా విశ్వేశ్వర్రెడ్డి తదితర 25 మంది నేతలతో చర్చించానని ఆయన చెప్పినట్టు ఆ పోస్టులో పేర్కొన్నారు. వైరల్గా మారిన ఈ పోస్టుపై రాజగోపాల్రెడ్డి వైపు నుంచిగానీ, బీజేపీ వైపు నుంచి కానీ ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం.
మరోవైపు ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఎవరూ ధ్రువీకరించలేదు. మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి తరువాత రాజగోపాల్రెడ్డి బీజేపీ వైఖరిపై అసంతృప్తిగానే ఉన్నారు. ఆయన మళ్లీ కాంగ్రెస్కు వెళ్తారనే ప్రచారం కొన్నాళ్లుగా జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే ఈ పోస్ట్ కనిపించడంపై సోషల్మీడియాలో ఆసక్తికర చర్చ సాగుతున్నది. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేనని సీఎం కేసీఆర్ మొదటి నుంచీ చెప్తున్నారని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. బీఆర్ఎస్ను ఓడించి, తెలంగాణను తమ గుప్పిట్లోకి తీసుకోవడమే ఆ పార్టీల లక్ష్యమని, ఆ రెండు పార్టీలు ఉమ్మడిగా పోటీ చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నారు.