Congress | హైదరాబాద్/ఖమ్మం/నల్లగొండ ప్రతినిధి, జూలై 1(నమస్తే తెలంగాణ): ఖమ్మం సభ సాక్షిగా కాంగ్రెస్లో వర్గపోరు భగ్గుమంటున్నది. ఆదివారం నిర్వహించనున్న ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ హాజరుకానున్న నేపథ్యంలో వైరివర్గాలు సాగిస్తున్న ఆధిపత్యపోరు కాంగ్రెస్ పార్టీని నవ్వులపాలు చేస్తున్నది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క 109 రోజులపాటు చేసిన పాదయాత్రను ముగిస్తుండటం, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో నిర్వహిస్తున్న ఈ సభ ఆధిపత్యపోరుకు మరోసారి తెరలేపింది. ఈ సభను పొంగులేటి హైజాక్ చేశారన్న అభిప్రాయం కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతున్నది. పొంగులేటి వ్యవహారశైలిపై వైరివర్గాలు మండిపడుతున్నాయి. ‘వంద రోజులుగా మండే ఎండలను సైతం లెక్క చేయకుండా పార్టీ కోసం పాదయాత్ర చేస్తే.. నాకు దక్కిన గుర్తింపు ఏదీ? పాదయాత్ర ముగింపు సభను చేరికల సభగా మార్చేశారు. పార్టీలోని ఒకరిద్దరు నేతలు సభను హైజాక్ చేసి నా పాదయాత్రకు పేరు రాకుండా కుట్ర చేస్తున్నారు’ అంటూ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తన సన్నిహితుల వద్ద వ్యక్తం చేసిన ఆవేదన కాంగ్రెస్లో హాట్టాపిక్గా మారింది. ఖమ్మం పట్టణంలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు, సభ నిర్వహణ ఏర్పాట్ల విషయంలోనూ పొంగులేటి, రేవంత్ వ్యవహరిస్తున్న తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. పొంగులేటిని అడ్డం పెట్టుకుని ఖమ్మంలో భట్టి ప్రాధాన్యం తగ్గించేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయం కాంగ్రెస్ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నది.
రేవంత్ ఫొటో పెట్టని కోమటిరెడ్డి
ఖమ్మం సభ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ట్విట్టర్లో పోస్ట్ చేసిన పోస్టర్ కలకలం సృష్టిస్తున్నది. ఖమ్మంలో సభకు కార్యకర్తలు తరలిరావాలంటూ కోమటిరెడ్డి విడుదల చేసిన పోస్టర్లో పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఫొటో లేకపోవడం వారిద్దరి మధ్య విభేదాలను మరోసారి బహిర్గతం చేసింది. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డిని గుర్తించడం లేదంటూ గతంలో వ్యాఖ్యానించిన వెంకట్రెడ్డి ఈ పోస్టర్ విషయంలో అందుకు తగ్గట్టుగానే వ్యవహరించారు. తన ఫొటోతోపాటు పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీ, మల్లికార్జునఖర్గేతోపాటు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఫొటోలను కూడా ముద్రించినప్పటికీ, రేవంత్రెడ్డి ఫొటోకు మాత్రం స్థానం ఇవ్వలేదు. ఇటీవల నల్లగొండలో సాగిన భట్టి పాదయాత్రకు కూడా కోమటిరెడ్డి దూరంగానే ఉన్నారు. స్వయంగా భట్టి ఫోన్ చేసినా స్పందించలేదు. ఈ నేపథ్యంలో రేవంత్రెడ్డి ఫొటో లేకుండా విడుదల చేసిన పోస్టర్ పార్టీలో అంతర్గత కలహాలను మరోసారి బయటపెట్టింది. ఖమ్మంలోనూ ఇదే తరహా ప్రచార యుద్ధం జరుగుతున్నది. ఏ వర్గానికి ఆ వర్గం తమ నాయకుల ఫొటోలతోనే ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నది.
రేణుకాచౌదరి వర్గం అసంతృప్తి
ఖమ్మం జిల్లా కాంగ్రెస్లో ఇప్పటికే సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి వర్గాల మధ్య పోరు నడుస్తున్నది. తాజాగా పొంగులేటి అనుచరుల తీరు తలనొప్పులు తెచ్చిపెడుతున్నది. పీపుల్స్ మార్చ్ పేరుతో 108 రోజులు పాదయాత్ర చేసిన మల్లు భట్టి విక్రమార్కకు ఖమ్మంలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలలో అనుకున్నంత ప్రాధాన్యం లభించడం లేదన్న అసంతృప్తి భట్టి అనుచరుల్లో గూడు కట్టుకున్నది. రేణుకాచౌదరితోపాటు మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావుకు కూడా స్వాగత ఫ్లెక్సీల్లో చోటు దక్కకపోవడంతో ఆ సామాజికవర్గానికి చెందిన నేతలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. సభ ఏర్పాట్లు ఆద్యంతం పొంగులేటి అనుచరులే చూస్తుండటం, పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తలకు భాగస్వామ్యం కల్పించకపోవడంపై సీనియర్ కాంగ్రెస్ నాయకులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉన్న పొంగులేటి భవిష్యత్తులో తమతో ఎలా వ్యవహరిస్తాడోనని సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు వ్యాఖ్యానించడం విశేషం. ఫ్లెక్సీల వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తడంతో పొంగులేటి అనుచరులు దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారు. రేణుకాచౌదరి ఫొటోలను ప్రస్తుతం ఉన్న ఫ్లెక్సీల్లో చేర్చడానికి చేస్తున్న ప్రయత్నాలను ఆమె వర్గీయులు తప్పుబడుతున్నారు. చివరి నిమిషంలో ఫొటోలు పెట్టడం ఎటువంటి సంకేతాలు ఇస్తుందోనని మండిపడుతున్నారు. రాహుల్గాంధీ పాల్గొనే ఖమ్మం సభలో పార్టీ నేతలను సమన్వయం చేసే నాయకుడే కరవయ్యాడని, రాష్ట్ర, జిల్లాస్థాయి నేతల విషయంలో మర్యాద పాటించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర నేతలు ఖమ్మంలో మకాం వేసినా ఈ తరహా లోపాలు నివారించలేకపోతున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.