Komatireddy Venkat Reddy | ‘మాటలు కోటలు దాటుతాయి కానీ చేతలు గడప కూడా దాటవు’ అనే సామెత కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి అతికినట్టు సరిపోతుంది. నోరు తెరిస్తే నల్లగొండకు తానే బ్రాండ్ అని కోమటిరెడ్డి గొప్పలు చెప్పుకుంటారు. అవకాశం దొరికితే రాష్ర్టాన్నే పాలించాలని కలలు కంటారు. కానీ, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన నల్లగొండ నియోజకవర్గానికి ఆయన చేసింది ఏమీ లేదు.
దశాబ్దాల నుంచి నల్లగొండ పట్టణం జిల్లా కేంద్రంగా కొనసాగుతున్నది. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరాల్లో ఒకటిగా ఎదిగేందుకు నల్లగొండకు అవకాశం ఉన్నా నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్న వెంకట్రెడ్డి పట్టించుకోలేదు. మంత్రిగా పని చేసినా, పదేండ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా ఆయనతో నల్లగొండకు ఒరిగింది ఏమీ లేదు. కోమటిరెడ్డి హయాంలో 20 ఏండ్లలో నల్లగొండ నియోజకవర్గానికి దాదాపు రూ.300 కోట్లు ఖర్చు చేయగా.. గత ఐదేండ్లలోనే కంచర్ల భూపాల్రెడ్డి ఎమ్మెల్యేగా రూ.1800 కోట్లతో నల్లగొండ అభివృద్ధి జరిగింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కంచర్ల భూపాల్రెడ్డి గెలిచిన తర్వాత నల్లగొండ నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. ఐదేండ్లలోనే ఆదర్శ నియోజక వర్గంగా తీర్చిదిద్దారు. నల్లగొండ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపారు. నిధుల వరద పారించారు. నల్లగొండకు ఐటీ ఇండస్ట్రీ వచ్చింది. ఇక్కడి బిడ్డల భవిష్యత్తుకు భరోసా దక్కింది.
నల్లగొండకు మెడికల్ కళాశాల తెస్తానని ప్రతి ఎన్నికల్లో కోమటిరెడ్డి హామీ ఇచ్చి ఓట్లు వేయించుకొని నెరవేర్చలేదు. కానీ, కేసీఆర్ ప్రభుత్వం రూ.110 కోట్లతో ప్రభుత్వ మెడికల్ కళాశాలను నిర్మిస్తున్నది. 2009లో కోమటిరెడ్డి ఐటీ శాఖ మంత్రిగా ఉండి నల్లగొండకు ఐటీ హబ్ తెస్తానని మాట ఇచ్చి తప్పారు. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం నల్లగొండలో రూ.50 కోట్లతో ఐటీ టవర్ నిర్మించింది. పట్టణంలో ప్రధాన రోడ్లను విస్తరించి, ముఖ్య కూడళ్లను సుం దరీకరిస్తానని ప్రతి ఎన్నికలోనూ కోమటిరెడ్డి హామీ ఇచ్చి చేతులెత్తేశారు. కంచర్ల దాదాపు రూ.250 కోట్లతో రోడ్ల విస్తరణ, కొత్త రోడ్ల నిర్మాణం, ఫ్లైఓవర్, ఫుట్ఓవర్, బ్రిడ్జిల నిర్మాణాన్ని చేపట్టారు. ప్రముఖుల విగ్రహాలను ఏర్పా టు చేశారు. స్వాగత తోరణాలు నిర్మించారు. సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుచేశారు. ఈ పనులతో నల్లగొండ పట్ట ణానికి కొత్త శోభ వచ్చింది.
స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద నల్లగొండకు కేసీఆర్ ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు కేటాయించింది. ఈ నిధులతో మొదటిదశ రోడ్ల నిర్మాణం జరిగింది. రూ.19.8 కోట్లతో రెండో దశ రోడ్ల నిర్మాణం చేపట్టారు. రూ.10 కోట్లతో పట్టణంలో వరద నీటి కాల్వలను నిర్మిస్తున్నారు. రూ.4కోట్లతో మామిడాల వాగుపై బ్రిడ్జి ఏర్పాటవుతున్నది. రూ.4.5 కోట్లతో వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్, రూ.3 కోట్లతో వైకుంఠధామం, రూ.18 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ క్రమబద్ధీకరణ పనులు పూర్తయ్యాయి. నియోజకవర్గంలోని ప్రతి వీధిలో బీటీ లేదా సీసీ రోడ్లు వేయించారు. నల్లగొండ పట్టణంలో రూ.4 కోట్లతో పార్కులను, నీలగిరి అర్బన్ ఆక్సిజన్ పార్కును అభివృద్ధి చేశారు. ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్, ఓపెన్ జిమ్లు నిర్మించారు. తిప్పర్తి, కనగల్, నల్లగొండ మండలాల్లోని గ్రామాలు కూడా ఈ ఐదేండ్లలో బాగా అభివృద్ధి చెందాయి. మిషన్ భగీరథ కింద ఇంటింటికీ నీరందుతున్నది. ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ జరిగింది.
20 ఏండ్ల తర్వాత మొదటిసారి 2018లో నల్లగొండ ప్రజలు కం చర్లను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. ఈ ఐదేండ్లలో జరిగిన అభివృద్ధిని ప్రజలు చూస్తున్నారు. దీంతో ఈ ఎన్నికల్లోనూ ప్రజలు మరోసారి బీఆర్ఎస్కే మద్దతు పలికే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.