Revanth Reddy | హైదరాబాద్ : ఉచిత కరెంట్పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీలో కలవరం మొదలైంది. రేవంత్ తీరుపై కాంగ్రెస్ పెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఇలాంటి ప్రకటనలు చేసేందుకు రేవంత్ ఎవరని కాంగ్రెస్ సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీ కాదు.. జాతీయ పార్టీ.. ఏవైనా నిర్ణయాలు తీసుకోవాలంటే.. మా జాతీయ నాయకత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఆ అధికారం రేవంత్ రెడ్డికి లేదని సీనియర్లు తేల్చిచెప్పారు.
ఉచిత విద్యుత్ విషయంలో రేవంత్ మాట్లాడింది తప్పే అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. తాను, రేవంత్ కేవలం కో ఆర్డినేటర్స్ మాత్రమే అని తెలిపారు. రేవంత్ రెడ్డి ఏది చెబితే అది ఫైనల్ అవుతుందా? అంటూ కోమటిరెడ్డి ప్రశ్నించారు. కోమటిరెడ్డితో పాటు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను పలువురు నేతలు తప్పుబట్టారు.
మేం అధికారంలోకి వస్తే 8 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తాం : రేవంత్
వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ సరఫరాపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వస్తే 8 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఒక ఎకరానికి నీళ్లు పట్టాలంటే ఒక గంట సరిపోతుంది.. అలాంటప్పుడు నిరంతరాయ విద్యుత్ ఎందుకు అన్నట్లుగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న వ్యవసాయానికి నిరంతరాయ కరెంట్, రైతుబంధు పథకాలను కొనసాగిస్తారా? లేదా? అని అమెరికాలో ఎన్ఆర్ఐలు అడిగిన ప్రశ్నలకు ఈ మేరకు తన మనసులోని మాటను రేవంత్ రెడ్డి బయటపెట్టారు.
‘ ఒక ఎకరానికి నీళ్లు పట్టాలంటే ఒక గంట చాలు.. మూడెకరాలకు ఫుల్లుగా నీళ్లు పట్టాలంటే మూడు గంటలు చాలు.. అంటే రోజుకొక 8 గంటలు కరెంట్ ఇస్తే సరిపోతుంది.’ అని రేవంత్ రెడ్డి అన్నారు. రైతులకు నిరంతరాయ ఉచిత కరెంట్ ఇస్తున్న కేసీఆర్పై తన కుల్లును బయటపెట్టారు. కేవలం విద్యుత్ సంస్థల దగ్గర కమీషన్లకు కక్కుర్తి పడే వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అనే స్లోగన్ తీసుకొచ్చాడని ఆరోపించారు. ఉచిత కరెంట్ పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారంటూ విమర్శించారు. అయితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలు, రైతులు భగ్గుమన్నారు. వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసేలా కాంగ్రెస్ నిర్ణయాలు ఉన్నాయని మండిపడుతున్నారు.