సూర్యాపేట టౌన్, జనవరి 30 : మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని, ప్రభుత్వ కార్యక్రమంలో వీధి రౌడీలా ప్రవర్తించడాన్ని ప్రజలంతా చీదరించుకుంటున్నారని బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మండిపడ్డారు. మంగళవారం ఆయన సూర్యాపేటలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
బీబీనగర్ మండలం గూడూరు గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రారంభోత్సవంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.. జడ్పీ చైర్మన్ సందీప్రెడ్డిని చులకన చేసి మాట్లాడటం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అన్నారు. 75 ఏండ్లలో ఎంతోమంది మంత్రులు వచ్చారని, వారెవరూ ఇలా మాట్లాడలేదని పేర్కొన్నారు. గ్యారెంటీల అమలుపై ప్రశ్నించినందుకు మంత్రిననే సోయి లేకుండా జడ్పీ చైర్మన్ను నిందించడం హేయమైన చర్యగా అభివర్ణించారు.
జడ్పీ చైర్మన్కు ప్రోటోకాల్ ఉంటుందని, దాన్ని మరిచి పోలీసులను అడ్డం పెట్టుకొని.. ‘లాగేయండి.. కేసులు పెట్టండి’ అంటూ అరాచకం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎలిమినేటి మాధవరెడ్డి, ఉమా మాధవరెడ్డి మచ్చలేని నాయకులని, ఎంతో హూందాగా పాలన సాగించారని, అలాంటి కుటుంబానికి చెందిన సందీప్పై ఇలాంటి చర్యను ప్రజలంతా చీదరించుకుంటున్నారని అన్నారు. కార్యకర్తలను రెచ్చగొట్టి పోలీసులతో ఏకమై గూండాయిజం చేస్తారా? అని ప్రశ్నించారు.
లంకె బిందెలు కోసం వచ్చేది దొంగలే..
లంకె బిందెలు ఉన్నాయని వచ్చామని, ఇక్కడ మట్టి కుండలు ఉన్నాయని సీఎ రేవంత్రెడ్డి అంటున్నారని, లంకె బిందెల కోసం దొంగలు మాత్రమే వస్తారని బడుగుల వ్యాఖ్యానించారు. పాలకులు ప్రజాసేవ పేరుతో లంకెబిందెలు దెవులాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇలాంటి చర్యలతో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు పరాభావం తప్పదని హెచ్చరించారు. సూర్యాపేట జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికాయుగంధర్రావు మాట్లాడుతూ జడ్పీ చైర్మన్ సందీప్పై దాడిని జడ్పీ చైర్మన్లంతా ఖండిస్తున్నారని తెలిపారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.