హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ) : సీఎం కేసీఆర్ ఆశీర్వాద సభలు జనసంద్రాన్ని తలపించాయని తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ తెలిపారు. ఆశీర్వాద సభల విజయవంతంతో ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టడం రుజువైందని పేర్కొన్నారు. తొమ్మిదిన్నరేండ్ల పాలనలో దేశానికే దిక్సూచిగా తెలంగాణను తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా 96 ప్రజాఆశీర్వాద సభలను నిర్వహించి, సరికొత్త రికార్డు నెలకొల్పారని చెప్పారు.
ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు ఇన్ని సభలు నిర్వహించిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో మరింత పరిణతి అవసరమని ఎన్నికలొస్తే ఆగమాగం కావద్దని కేసీఆర్ పదేపదే చెబుతూ ప్రజలను సరైన దిశగా ఓటు హకు వినియోగించుకొనే విధంగా వారిలో చైతన్యం కల్పించారని వెల్లడించారు. ప్రజల ఆశీర్వాదంతో వందస్థానాల్లో గులాబీ జెండా రెపరెపలాడటం తథ్యమని దామోదర్ ధీమా వ్యక్తం చేశారు.