హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రూ.1600 కోట్ల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు మాయమవడంపై సమగ్ర విచారణ జరపాలని కేంద్రమంత్రి కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఆయన శనివారం లేఖ రాశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో సింగరేణి పాత్ర కీలకమని, ఈ సంస్థ ద్వారా 40 వేల మంది ఉద్యోగులు, వారి కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయని పేర్కొన్నారు. దేశంలో బొగ్గు ఉత్పత్తికి, దేశ ఇంధన భద్రతకు సింగరేణి కీలకమని గుర్తు చేశారు.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.51,500 కోట్లకు పైగా బకాయిల కారణంగా సింగరేణి ఆర్థికంగా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. సింగరేణిలో బొగ్గు మాయంపై తక్షణమే చర్యలు చేపట్టకపోతే సంస్థ ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. సమీక్షల ద్వారా వ్యవస్థలో లోటుపాట్లను సరిదిద్దాలని, ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా నిరోధించవచ్చని తెలిపారు. కార్మికుల సంక్షేమానికి సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక చొరవ చూపాలని కిషన్రెడ్డి కోరారు.