హైదరాబాద్: ప్రజలను మోసంచేయడంలో ఘనమైన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ మరోసారి తన నిజస్వరూపం బయటపడిందని కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) విమర్శించారు. గ్రూప్-1 పేరుతో తెలంగాణ యువతను మోసం చేసిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల వాగ్దానంలో భాగంగా.. ఫిబ్రవరి 1న నిరుద్యోగ యువతకోసం కోసం గ్రూప్-1 నోటిఫికేషన్ వేస్తామని.. అట్టహాసంగా వార్తాపత్రికల మొదటి పేజీలో కాంగ్రెస్ ప్రకటనలు ఇచ్చిందన్నారు. మరి ఒకటో తేదీ గడచిపోయిందని, ఇది ఫిబ్రవరి నెలేనన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సమయం దాటిపోయిందని చెప్పారు. గ్రూప్-1కు సంబంధించి ఇంతవరకైతే నోటిఫికేషన్ రాలేదని విమర్శించారు.
హామీలు ఇచ్చి మోసం చేసే ఘనచరిత్ర కలిగిన.. కాంగ్రెస్ పార్టీ మరోసారి తన నిజ స్వరూపాన్ని బయటపెట్టింది. నమ్మి ఓటేసిన తెలంగాణ యువతను నిట్టనిలువునా మోసం చేసింది. యువతను మోసం చేసినట్లే.. ఇతర వాగ్దానాలనూ వ్యూహాత్మకంగా దాటవేసే ప్రయత్నం జరుగుతున్నదని కిషన్ రెడ్డి అన్నారు.