హైదరాబాద్, ఏప్రిల్ 2(నమస్తే తెలంగాణ) : రాజ్యసభ వేదికగా తెలంగాణ చారిత్రక సత్యాలను కేంద్ర మంత్రి జీ కిషన్రెడ్డి వక్రీకరించారని, ఈ మాటలతో తెలంగాణపై ఆయనకున్న వివక్ష మరోసారి బయటపడిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ విమర్శించారు. ఈ మేరకు గురువారం ఆయన ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ చెందిన ఏడు మండలాలను ఏపీకి అప్రజాస్వామికంగా బీజేపీ ప్రభుత్వం అప్పగించినప్పటికీ, దీనికి తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సంబంధం ఉందని చెప్పడం నయవంచన అని ధ్వజమెత్తారు.
యూపీఏ రూపొందించిన విభజన బిల్లులో ఏడు మండలాలు అప్పగించాలని ఇన్ బిల్ట్లో ఉందని అలవోకగా చెప్పారని మండిపడ్డారు. అసలు విభజన బిల్లులో ఏడు మండలాల బదలాయింపు అనే అంశం లేదని గుర్తుచేశారు.
2014 ఫిబ్రవరిలో యూపీఏ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రైవేశపెట్టి ఆమోదింపజేసిన విభజన బిల్లులో ఏడు మండలాలు తెలంగాణలోనే ఉన్నాయని తెలిపారు. అయితే, 2014 మేలో ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మే 29న ఒక ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా పోలవరం ప్రాజెక్ట్ ముంపు ప్రాంతాల సాకుతో ఆ ఏడు మండలాలను ఏపీలో కలిపారని గుర్తుచేశారు.