అచ్చంపేట, మే 18 : పద్మశ్రీ అవార్డులను బీజేపీ నాయకులు రాజకీయాలకు వాడుకోవడంపై కిన్నెర కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను అనవసరంగా రాజకీయాల్లోకి లాగుతున్నారంటూ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ 500 ఏండ్ల నాటి కిన్నెర కళను గుర్తించి జీవం పోశారని, ఆయన మేలు ఎన్నటికీ మరువలేనన్నారు. అయితే బీజేపీ నేతలు.. సీఎం కేసీఆర్ను, తన కళను అవమాన పరుస్తున్నారంటూ ఆవేదన చెందారు. అవసరమైతే పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేస్తానంటూ ఆయన భావోద్వేగంతో ప్రకటించారు. బుధవారం ఆయన నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో మీడియాతో మాట్లాడుతూ.. అచ్చంపేటకు చెందిన బీజేపీ నేత మంగ్యానాయక్ తనను ఉద్దేశపూర్వకంగా పిలిపించుకొని సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ.కోటి ఇచ్చారా? అంటూ అవహేళనగా మాట్లాడారని, తనకు తెలియకుండానే వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసి అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు.
‘పద్మశ్రీ అవార్డు ఇచ్చింది కేసీఆర్ కాదు.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. నీకు రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదు. ప్రకటించిన రూ.కోటి కేసీఆర్ ఇంట్లో నుంచి ఇస్తలేరు’ అని బీజేపీ నేత అవమానించేలా మాట్లాడటం తనకు బాధ కలిగించిందన్నారు. ఇన్ని అవమానాల పద్మశ్రీ అవార్డు తనకు వద్దని.. అవసరమైతే తిరిగి ఇచ్చేస్తానని ప్రకటించారు. మొదటగా తన కళను గుర్తించి ఉగాది పురస్కారం ఇచ్చారని.. కళ బయటకు రాకుంటే తనకు ఈ గుర్తింపు ఎక్కడిదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం రెండేండ్ల నుంచి ప్రతినెలా రూ.10 వేల పింఛన్ ఇస్తుండటం వల్లే తన కుటుంబం గడుస్తున్నదన్నారు. పాఠ్యపుస్తకంలో పెట్టడం, బేగంపేట బ్రిడ్జి పిల్లర్పై తన ఫొటోను ముద్రించారని, సీఎం కేసీఆర్ హయాంలో తనకు ఎనలేని గుర్తింపును ఇచ్చారని తెలిపారు. తన కళను రాజకీయం చేసేవిధంగా బీజేపీ నేత వ్యవహరించిన తీరును జీర్ణించుకోలేకపోతున్నానని స్పష్టం చేశారు.