బేగంపేట, ఏప్రిల్ 16: శ్వాస నాళంలో భారీ కణితి ఏర్పడటం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ వ్యక్తికి కిమ్స్ వైద్యులు ఊరట కల్పించారు. రిజిడ్ బ్రాంకోస్కోపీ అనే పరికరం ద్వారా ఎండోస్కొపీ పద్ధతిలో ఆ కణితిని తొలగించినట్టు పల్మనాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్కిషన్ జువ్వా ఆదివారం వెల్లడించారు.
నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి (58)కి తీవ్ర ఆయాసం, జ్వరంతో ఊపిరి అందని పరిస్థితి ఏర్పడింది. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కిమ్స్కు తీసుకొచ్చారు. వైద్యులు పరీక్షించి 2.5 సెంటిమీటర్ల పొడవు, 1.8 సెంటిమీటర్ల వెడల్పుతో శ్వాస నాళంలో 80-90% మేరకు కణితి ఆక్రమించినట్టు గుర్తించారు.
సాధారణంగా పురుషుల్లో శ్వాస నాళం 1.5 నుంచి 2 సెంటిమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుందని డాక్టర్ శ్రీకాంత్కిషన్ చెప్పారు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందేమీ ఉండదని, అందుకే బాధితుడు తన సమస్యను ముందుగా తెలుసుకోలేకపోయాడని తెలిపారు. ఇలాంటి కణుతులను ఆపరేషన్ చేసి తొలగిస్తారని, తాము మాత్రం ఎండోస్కొపీ పద్ధతిలో ఈ కణితిని తొలగించామని వివరించారు.