హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): కరోనా సంక్షోభం మన విద్యా వ్యవస్థలో అనేక మార్పులకు నాంది పలికింది. విద్యార్థులు ప్రత్యక్ష చదువులకు దూరమైనా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకొన్నారు. మన రాష్ట్రంలో ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు విద్యార్థులు భిన్న రకాల నైపుణ్యాలు సాధించేందుకు కరోనా సంక్షోభ కాలం ఉపయోగపడింది. కేంద్ర విద్యాశాఖ నిర్వహించిన నేషనల్ అచీవ్మెంట్ సర్వే-2021 సర్వేలో అనేక కొత్త విషయాలు తెలిశాయి.
మూడో తరగతి చదువుతున్నవారిలో 51శాతం విద్యార్థులు పెయింటింగ్, వంట చేయటం, యోగా, పాటలు పాడటం, ఇండోర్గేమ్స్, సంగీతం వంటి వాటిని నేర్చుకొన్నారు. 49 శాతం పిల్లలు కరోనాతో ఎంతో నేర్చుకున్నామని వెల్లడించగా, 45 శాతం మంది మాత్రం తమ చదువులకు ఆటంకం కలిగిందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో 3, 5, 8, 10 తరగతుల్లో విద్యార్థుల సామర్థ్యాలపై 2021లో నేషనల్ అచీవ్మెంట్ సర్వే నిర్వహించారు. 4,781 స్కూళ్లలో ఈ సర్వేను నిర్వహించగా, 1,45,420 విద్యార్థులు, 22,818 మంది టీచర్లు పాల్గొన్నారు. సర్వే ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ బుధవారం విడుదల చేసింది.
3వ తరగతిలో 95 శాతం విద్యార్థులు బడికి వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. 92 శాతం మంది టీచర్లు చెప్తున్న అంశాలను అర్థం చేసుకొంటున్నారు. 77 శాతం మాతృభాషలో చదివేందుకు ఇష్టపడుతున్నారు.
ప్రైవేటుకన్నా ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులే ఉత్తమ ప్రతిభ కనబరిచారు. మూడో తరగతి విద్యార్థులు భాషల్లో 50 శాతం, గణితంలో 45 శాతం, పరిసరాల విజ్ఞానంలో 46 శాతం సామర్థ్యాలను సాధించగా, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు భాషల్లో 47, గణితంలో 44, పరిసరాల విజ్ఞానంలో 44 శాతం మాత్రమే సామర్థ్యాలు సాధించారు.
ఐదో తరగతి స్థాయిలో భాషల్లో ఎస్సీ విద్యార్థులు 38 శాతం, ఎస్టీలు 39 శాతం, ఓబీసీలు 41 శాతం
సామర్థ్యాలు సాధించారు.
కరోనాతో 60 శాతం విద్యార్థులు పెయింటింగ్, ఆటలు, యోగా వంటివి నేర్చుకొన్నారు.
8వ తరగతి స్థాయిలో 97 శాతం విద్యార్థులు బడికి వెళ్లేందుకు ఆసక్తి చూపారు. పదో తరగతి వారిలో 97 శాతం మంది బడికి వెళ్లేందుకు ఆసక్తి చూపించారు.