హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): ‘ఆజాద్ కా అమృత్ మహోత్సవ్’ విజయవంతానికి బుధవారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి అధ్యక్షతన సమావేశమయ్యారు. ఈ నెల 12 నుంచి వచ్చే ఏడాది ఆగస్టు 15 వరకు 75 వారాలపాటు రాష్ట్రవ్యాప్తంగా దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించే విషయమై చర్చించారు. స్వాతంత్య్ర భారత్ 75వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ‘ఆజాద్ కా అమృత్ మహోత్సవ్’ నిర్వహించనున్నందున, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బుధవారం ఏర్పాట్లపై సమీక్షించారు. సమావేశంలో వివిధ శాఖల ముఖ్యకార్యదర్శులు రామకృష్ణారావు, శ్రీనివాసరాజు, సత్యనారాయణ, సందీప్కుమార్ సుల్తానియా, మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.