సుల్తానాబాద్, ఏప్రిల్ 6: యాక్సెల్ కెమెరాను ఆవిష్కరించి జాతీయస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ఇన్స్పైర్ అవార్డు సాధించిన విద్యార్థిని ఎం పూజకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం అందింది. ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనున్న కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎదుట తన ఆవిష్కరణను ప్రదర్శించనున్నారు.
రాష్ట్రపతితో జరిగే ముఖాముఖిలో పాల్గొంటారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కోలనూర్కు చెందిన పూజ సుల్తానాబాద్ అల్ఫోర్స్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నది. గతంలో ఎదురైన ప్రమాద ఘటనతో కలత చెందింది. సృజనాత్మకతకు పదునుపెట్టి వాహనాలకు వినియోగించేందుకు యాక్సెల్ కెమెరాను రూపొందించింది. ఈ ప్రాజెక్టు ఇటీవల నిర్వహించిన నేషనల్ సైన్స్ఫెయిర్లో ఇన్స్పైర్ అవార్డు దక్కించుకున్నది. ఈ నేపథ్యంలోనే ఆమెకు రాష్ట్రపతి భవన్నుంచి ఆహ్వానం అందింది. కాగా, గురువారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో అల్ఫోర్స్ చైర్మన్ నరేందర్రెడ్డి, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు అభినందించారు. ఓ మారుమూల పల్లె చెందిన విద్యార్థినికి రాష్ట్రపతిని కలుసుకునే అవకాశం రావడం గర్వకారణమన్నారు.