ఖమ్మం, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఖమ్మం నగర శివారు వెలుగుమట్ల భూదాన్ భూముల్లో నిరుపేదలు వేసుకున్న గుడిసెలు, ఇండ్లను తొలగించడంలో కీలకంగా వ్యవహరించిన ఖమ్మం ఆర్డీవో నర్సింహారావుపై సర్కార్ బదిలీ వేటువేసింది. భూదాన్ భూముల్లో ఇండ్లు కట్టుకొని నివాసం ఉన్నవారికి పట్టాలు ఉన్నా ఎలా కూల్చివేస్తారని బీఆర్ఎస్ తీవ్రంగా మండిపడింది. ఇండ్ల కూల్చివేతతో నిరాశ్రయబాధితులను పరామర్శించడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం రావడంతో ప్రభుత్వానికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.
దీంతో విషయ తీవ్రతను తగ్గించడానికి ఆర్డీవో నర్సింహారావును జగిత్యాల జిల్లా మెట్పల్లి ఆర్డీవోగా ఆకస్మికంగా బదిలీచేసింది. అక్కడ పనిచేస్తున్న శ్రీనివాస్ను ఖమ్మం ఆర్డీవోగా నియమించారు. భూదాన్ భూముల ఆక్రమణల తొలగింపు వ్యవహారంలో తప్పు తమది కాదు.. అధికారులదే అనే భావన ప్రజల్లో కల్పించడానికే ప్రభుత్వ పెద్దలు ఆయనను సాగనంపినట్టు భూదాన్ బాధితులు ఆరోపిస్తున్నారు. ఆ భూముల్లో పేదలు వేసుకున్న గుడిసెలను తొలగించే ప్రక్రియను నర్సింహారావు ఆర్డీవో హోదాలో పర్యవేక్షించారు. గుడిసెల తొలగింపును ప్రత్యక్షంగా పర్యవేక్షించిన తహసీల్దార్పై ఒకటి రెండు రోజుల్లో బదిలీవేటు పడనున్నట్టు ప్రచారం.