ఖమ్మం, మార్చి 7 (నమస్తేతెలంగాణ ప్రతినిధి): ఖమ్మం పార్లమెంట్ స్థానం బీఆర్ఎస్దేనని ఆ పార్టీ లోక్సభ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అధ్యక్షతన గురువారం ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో పార్లమెంట్ నియోజకవర్గస్థాయి విస్తృత స్థాయి సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో నామా మాట్లాడుతూ.. జిల్లా ప్రజలు తనను రెండుసార్లు ఎంపీగా గెలిపించి పార్లమెంట్కు పంపారని, మళ్లీ తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఖమ్మం జిల్లాకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారని, పార్లమెంట్ ఎన్నికల్లో నామాను గెలిపించి కేసీఆర్కు కానుక ఇద్దామని కార్యకర్తలకు సూచించారు.
మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ప్రజలను కష్టాల పాలుచేసిందని విమర్శించారు. అనంతరం.. ఖమ్మం నగరంలోని గాయత్రి మైదానంలో నిర్వహించిన ‘కేసీఆర్కు కృతజ్ఞత, వద్దిరాజు రవిచంద్రకు అభినందన’ సభలో ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, జడ్పీ వైస్ చైర్మన్ ధనలక్ష్మి, ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు, బానోతు మదన్లాల్, తాటి వెంకటేశ్వర్లు, నేతలు కొండబాల కోటేశ్వరరావు, చంద్రావతి, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.