Paleru | కూసుమంచి, ఫిబ్రవరి 4: ప్రస్తుత వ్యవసాయ సీజన్కు సాగర్ జలాల కొరత ఏర్పడటంతో ఖమ్మం జిల్లా ఆయకట్టు రైతులు ఆదివారం పాలేరు రిజర్వాయర్ వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం అనధికారికంగా తాగునీటి అవసరాలకు నిల్వ చేసిన నీటిని సాగర్ పాత కాలువ నుంచి దిగువకు విడుదల చేశారు. దీంతో రిజర్వాయర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఖమ్మం జిల్లాలో వ్యవసాయం 90 శాతం నాగార్జున సాగర్ జలాల పైనే ఆధారపడి ఉంటుంది. సాగర్ ప్రాజెక్ట్ నుంచి కాలువల ద్వారా పాలేరు రిజర్వాయర్కు చేరుకుని అక్కడి నుంచి జిల్లా నలుమూలలకు నీళ్లు వెళ్తాయి. రైతులు ఆ నీటితో పంటలు పండిస్తారు. ఎగువన జలాలు నిండుకోవడంతో ప్రస్తుత సీజన్లో రైతులు సాగునీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు.
ఈ క్రమంలో ఆయకట్టు రైతులు రిజర్వాయర్ కట్టపైకి వచ్చి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రిజర్వాయర్ పాత కాలువ నుంచి దిగువకు అనధికారికంగా జలాలను వదిలారు. విషయం తెలుసుకున్న నీటిపారుదల, రెవెన్యూ శాఖ అధికారులు, కూసుమంచి పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి రైతులను అడ్డుకోగా స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఆర్డీవో నగేశ్, ఏసీపీ బస్వారెడ్డి, నీటిపారుదల శాఖ ఈఈలు అనన్య, మంగలపూడి వెంకటేశ్వర్లు, డీఈలు మధు మన్మథరావు, రత్నకుమారి, సీఐ జితేందర్, ఎస్సైలు రమేశ్కుమార్, సతీశ్, శ్రీను రైతులతో సుదీర్ఘ చర్చలు జరిపారు. అనంతరం అధికారులు, రైతులు సమస్యను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయ ఇన్చార్జి తుంబూరి దయాకర్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. రైతులు ఆందోళన విరమించడంతో అధికారులు కాలువ గేట్లను మూసివేశారు.