ఖమ్మం మామిళ్లగూడెం, ఆగస్టు 4: దేశభక్తి పెంపొందే విధంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నిర్వహించాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల నిర్వహణపై గురువా రం ఖమ్మం కలెక్టరేట్లో జిల్లా వజ్రోత్సవాల కమిటీ బాధ్యులతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల్లో అడుగడుగునా దేశభక్తి భావన కలిగేలా వజ్రోత్సవాలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ఇండ్లపై జాతీయ జెండాలను ఎగురవేయాలని సూచించారు. ప్రతి ఇంటికీ జాతీయ జెండాలను ఉచితంగా పంపిణీ చేయాలన్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్ర వజ్రోత్సవ ద్విసప్తాహాన్ని ఘనంగా నిర్వహిస్తున్నదని తెలిపారు. ఈ నెల 8 నుంచి 22వ తేదీ వరకు కార్యక్రమాలను నిర్వహించాలని, ఇందులో ప్రతి ఒకరినీ భాగస్వాములను చేయాలన్నారు. సమావేశంలో కలెక్టర్ వీపీ గౌతమ్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు తదితరులు పాల్గొన్నారు.