విద్యా ప్రమాణాలు పెంచేందుకే రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు- మన బడి’కి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలను ఆధునికీకరించి విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన చేయడమే సర్కారు ఉద్దేశం. ఒక్కో విద్యార్థి చదువు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.1.25 లక్షలు ఖర్చుచేస్తున్నది.
– కేటీఆర్
రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ): మలిదశ ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీకి కట్టుబడి.. విద్యార్థులు పలకతో వచ్చి పట్టాతో ఇంటికి వెళ్లే విధంగా అధునాతన హంగులతో ఒకే చోట కేజీ టు పీజీ క్యాంపస్ను నిర్మించారని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ‘మన ఊరు-మన బడి’లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో రూ.11.50 కోట్ల వ్యయంతో ఆధునిక హంగులతో నిర్మించిన కేజీ టు పీజీ క్యాంపస్ను బుధవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి కేటీఆర్ ప్రారంభించారు.
అనంతరం డిజిటల్ లైబ్రరీ, డైనింగ్ హాలు, క్రీడా మైదానాలను పరిశీలించారు. క్యాంపస్ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. విద్యలో అభివృద్ధి చెందిన దేశాలే సామాజికాభివృద్ధిలో ముందుకు పోతున్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్ సారథ్యం లో కేజీ నుంచి పీజీ వరకు ఉన్నత ప్రమాణాలతో విద్యనందిస్తున్నామని తెలిపారు. 2004 సెప్టెంబర్ 17న ఉద్యమ సమయంలో గంభీరావుపేటకు వచ్చిన అప్పటి ఉద్యమ నేత, సీఎం కేసీఆర్.. తెలంగాణ వచ్చాక కేజీ టు పీజీ విద్యాసంస్థలను ఇక్కడ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్టు గుర్తుచేశారు. గంభీరావుపేట కేజీ టు పీజీ విద్యాసంస్థలకు ఆచార్య జయశంకర్ పేరు పెట్టాలని కలెక్టర్ అనురాగ్ జయంతికి సూచించారు.
ప్రమాణాలు పెంచేందుకే..
విద్యా ప్రమాణాలు పెంచేందుకే రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు- మన బడి’కి శ్రీకారం చుట్టిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలను ఆధునికీకరించి విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన చేయడమే సర్కారు ఉద్దేశమని చెప్పారు. తిరుపతి, షిర్డీలో మాదిరిగా ఈ కేజీ టు పీజీ విద్యాసంస్థల్లో ఒకేసారి వెయ్యి మంది విద్యార్థులు భో జనం చేసేలా డైనింగ్ హాలు నిర్మించినట్టు వివరించారు. ఒక్కో విద్యార్థి చదువు కోసం ప్రభు త్వం ఏడాదికి రూ.1.25 లక్షలు ఖర్చుచేస్తున్నట్టు తెలిపారు. 28 రాష్ర్టాల్లో అతి తక్కువ వయసు గల రాష్ట్రం తెలంగాణేనని, ఏ రాష్ట్రంలో లేనివిధంగా అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల్లా పరుగులు పెట్టించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని కొనియాడారు.
ప్రగతిని వివరిస్తాం.. ఆశీర్వాదం తీసుకొంటాం
రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎనిమిదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి ఏమిటో ప్రజలందరికీ తెలుసని మంత్రి కేటీఆర్ తెలిపారు. విద్య, వైద్యం, ఉపాధి, విద్యుత్తు, టెక్స్టైల్స్ ఇలా అన్ని రంగాల్లోనూ చేపట్టిన పనులపై నివేదికలు తయారు చేసి ప్రజల చేతిలో పెడతామని, చేసిన పనులను వివరించి ప్రజల ఆశీర్వాదం తీసుకొంటామని కేటీఆర్ పేర్కొన్నారు. కేజీ టు పీజీ విద్యాసంస్థలను స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామని తెలిపారు. కంటి వెలుగు వైద్య శిబిరాలు విజయవంతంగా నడుస్తున్నాయని, శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకొన్న పేదలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని కేటీఆర్ వివరించారు.
కేజీ టు పీజీ క్యాంపస్ అద్భుతం: మంత్రి సబిత
మంత్రి కేటీఆర్ చొరవతో అధునాతన హంగులతో గంభీరావుపేటలో నిర్మించిన కేజీ టు పీజీ విద్యాసంస్థలు అద్భుతంగా ఉన్నాయని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు-మనబడి’ కార్యక్రమంలో 12 అంశాలతో పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. రూ.7,300 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల పాఠశాలలను మూడు విడుతల్లో అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. తొలివిడతలో రూ.3,509 కోట్లతో 9 వేల పాఠశాలలు అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పా రు. సీఎం కేసీఆర్ దిశానిర్దేశంతో రాష్ట్రంలోని అన్ని సర్కారు బడుల్లో ఆంగ్ల బోధన, డిజిట ల్ క్లాసులు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. కేజీ టు పీజీ క్యాంపస్ నిర్మాణానికి తోడ్పాటునందించిన రహేజా, దివీస్ ల్యాబొరేటరీ, గివ్ తెలంగాణ, ఎమ్మార్ఎఫ్ ప్రతినిధులను మంత్రులు కేటీఆర్, సబితారెడ్డి సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, కలెక్టర్ అనురాగ్ జయంతి, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, చేనేత జౌళిశాఖ చైర్మన్ గూడూరి ప్రవీణ్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పాల్గొన్నారు.
విద్యార్థులతో మంత్రుల సహపంక్తి భోజనం
కేజీ టు పీజీ విద్యాసంస్థల ప్రారంభోత్సవానికి హాజరైన మంత్రులు కేటీఆర్, సబితారెడ్డి విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. వెయ్యి మంది ఒకేసారి కూర్చొని భోజనం చేసే డైనింగ్ హాలును చూసిన మంత్రి సబితారెడ్డి.. తాను ఇంతవరకు ఒక పాఠశాలలో ఇంత పెద్ద డైనింగ్ హాలు చూడలేదని ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ చిన్నారులు, ప్రాథమిక, ఉన్నత పాఠశాలల విద్యార్థులు మంత్రి కేటీఆర్తో సెల్ఫీలు దిగారు. కేటీఆర్ విద్యార్థులను దగ్గరకు తీసుకొని పాఠశాల ఎలా ఉందని అడిగి తెలుసుకొన్నారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
మార్చి నాటికి మరో 1,000 స్కూళ్ల ఆధునికీకరణ
‘మన ఊరు-మన బడి’ తొలి దశలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 700 పాఠశాలలను ఒకేరోజు ప్రారంభించుకోవడం సంతోషకరం. వచ్చే మార్చి 31 నాటికి మరో 1,000 స్కూళ్లను ఆధునికీకరిస్తాం. రానున్న ఐదారు నెలల్లో 9 వేల స్కూళ్లలో ఆధునిక వసతుల కల్పన పూర్తవుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో 298 రెసిడెన్షియల్ స్కూళ్లు ఉంటే ప్రస్తుతం 1,201 రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటుచేసుకున్నాం. వీటి ద్వారా 5.30 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం నాణ్యమైన విద్యను బోధిస్తున్నది. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులతోపాటు, కొత్త ఉపాధ్యాయుల నియామకాలు కూడా చేపడతాం.
-నిజాంపేట ప్రగతినగర్లోని పాఠశాలలో మంత్రి హరీశ్రావు
విద్యా ప్రమాణాలకు ప్రభుత్వం పెద్దపీట
‘సర్కారు బడి వద్దు’ అనే రోజులు పోయి.. ‘సర్కారు బడి ముద్దు’ అనే రోజులొచ్చాయి. విద్యారంగంపై సీఎం కేసీఆర్కు ఉన్న ప్రేమకు నిదర్శనమే ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం. ఒకతరం చదివితే ఇక ఆ సమాజానికి తిరుగులేదని నమ్మే సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణలో సర్కారు బడులకు ప్రాధాన్యం పెరిగింది. ప్రభుత్వ గురుకులాల్లో అడ్మిషన్ల కోసం పెరుగుతున్న పోటీ ఇందుకు నిదర్శనం.
-సూర్యాపేట జిల్లా చివ్వెంల పాఠశాలలో మంత్రి జగదీశ్రెడ్డి