హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): ‘నువ్వు దేనితో మొదలు పెట్టావో.. చివరికి అదే నీకు దక్కుతుంది’.. ఇటీవల ఓ సినిమాలోని ఫేమస్ డైలాగ్ ఇది. ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఇలాగే మారింది. ఎన్నికల నాటికి మళ్లీ నలుగురైదుగురు నేతలే మిగిలే పరిస్థితి కనిపిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కొన్నేండ్ల క్రితం కే లక్ష్మణ్, కిషన్రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ వంటి నేతలు మాత్రమే ఉండేవారు. ఆ తర్వాత రఘునందన్రావు, ఈటల రాజేందర్ వంటి నేతలు పార్టీలో చేరారు. రెండు ఉప ఎన్నికల్లో గెలవడం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కొన్ని సీట్లు రావడంతో ఇక వచ్చే ఎన్నికల్లో తమదే అధికారం అంటూ ఊదరగొట్టారు.
అది కేవలం వాపేనని, గాలిబుడగ మాదిరిగా పేలిపోతుందని, నేల విడిచి సాము చేయొద్దని ఆరెస్సెస్ వాదులు ఎంత మొత్తుకున్నా వినలేదు. కొన్ని రోజులకే పార్టీలో కలహాలు, ఆధిపత్య పోరాటాలు మొదలయ్యాయి. దీనికి బండి వ్యవహారశైలి మరింత ఆజ్యం పోసింది. చివరికి కోరి తెచ్చుకున్న మునుగోడు ఉప ఎన్నికతో పార్టీ కొంప మునిగింది. ఒక్క ఓటమితో బీజేపీకి బీటలు వారాయి. వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై ఒక వర్గం తిరుగుబాటు జెండా ఎగురవేయగా.. మరో వర్గం ఆయనకు మద్దతుగా నిలుస్తున్నది. పార్టీలో పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేకపోవడంతో ఇప్పుడు బీజేపీ నేతలంతా పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కాంగ్రెస్లో చేరడం దాదాపు ఖాయమైపోయింది. తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ద్వారా రాయబారం నడుపుతున్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఆయన రావడం లాంఛనమేనని, ముహూర్తం చూసుకొని వస్తారని పేర్కొంటున్నారు.
ఈటల రాజేందర్ను బీఆర్ఎస్ నుంచి బహిష్కరించినప్పుడే కాంగ్రెస్లోకి వెళ్తారని లీకులు మొదలయ్యాయి. అయితే కేసుల నుంచి తప్పించుకునేందుకు బీజేపీలో చేరారని విశ్లేషకులు చెప్తున్నారు. ఇటీవల హైదరాబాద్లోని హోటళ్లలో రహస్యంగా కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కావాలంటూ అలగడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈటల పార్టీ మారడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
రఘునందన్రావు కూడా బీజేపీని వీడుతారని కథనాలు వెలువడుతున్నాయి. ఆయన దుబ్బాక ఉపఎన్నికల్లో గెలిచిన తరువాత తొలుత బీఆర్ఎస్లో ఆ తరువాత మరో ఇతర పార్టీలో చేరుతారని లీకులు మొదలయ్యాయి. బీజేపీలో తనకు అన్యాయం జరుగుతున్నదని కేంద్ర, రాష్ట్ర కమిటీల్లో స్థానం కల్పించలేదన్న అసంతృప్తితో ఆయన రగిలిపోతున్నారు. అసెంబ్లీ ఫ్లోర్లీడర్ పదవి కూడా ఇవ్వడం లేదని, ఫ్లోర్లీడర్ లేకుండానే పార్టీ కొనసాగడం ఏమిటని ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. తన తర్వాత చేరిన ఈటలకు జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించడం, తాజాగా వై క్యాటగిరీ భద్రత ఇవ్వడంతో రఘునందర్రావులో అసంతృప్తి పతాకస్థాయికి చేరినట్టు తెలుస్తున్నది. దీంతో కొన్ని వారాలుగా ఆయన సైలెంట్గా ఉంటున్న ఆయన పార్టీ మార్పిడిపై చర్చలు జరుపుతున్నట్టు గుసగుసలు మొదలయ్యాయి. తనకు ఫలానా సీటు కావాలని రఘునందన్ డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం.
డీకే అరుణ పరిస్థితి కూడా అంతే. పేరుకే పార్టీ జాతీయ ఉపాద్యక్షరాలైనా తనకు తెలంగాణలో సరైన గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె తన నియోజకవర్గానికే పరిమితమయ్యారు. కాంగ్రెస్లో చేరేందుకు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. వీళ్లతోపాటు బీజేపీలో చేరిన ఇతర నాయకులు కూడా వేరే పార్టీలోకి జంప్ కావాలని ఎదురు చూస్తున్నట్టు సమాచారం.
అధ్యక్ష పదవి చిచ్చు
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు వ్యవహారం బీజేపీలో పెద్ద చిచ్చుగా మారింది. బండి సంజయ్ అసమర్థుడని, కచ్చితంగా మార్చాలని ఈటల వర్గం భీష్మించుకొని కూర్చున్నది. ఈటల తనకు అధ్యక్ష పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు ఆరెస్సెస్ వాదులు పేర్కొంటున్నారు. ఒకవేళ మార్చకుంటే గంపగుత్తగా బయటికి వెళ్లిపోతామని బెదిరిస్తున్నట్టు చెప్తున్నారు. మరోవైపు కొందరు నేతలు బండికి మద్దతు పలుకుతున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. బండి సంజయ్ని మార్చి ఈటలకు అప్పగిస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ తాము బీజేపీలో ఉండబోమని ఆయన మద్దతుదారులు స్పష్టంచేసినట్టు సమాచారం. మొత్తంగా అధ్యక్ష పదవి మార్చినా, మార్చకున్నా.. జూలై రెండో వారం నుంచి బీజేపీ నుంచి వరుసగా వెళ్లిపోవడాలు ఉంటాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. చివరకు మళ్లీ బండి, కిషన్రెడ్డి, లక్ష్మణ్ వంటి పాత నేతలే మిగులుతారని అంటున్నారు.